Manipur | రెండు జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా ఫలితం లేదు. అల్లర్లతో రాష్ట్రం అట్టుడుకుతున్న సమయంలో మరో కొత్త తలనొప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. మయన్మార్ (Myanmar) నుంచి మణిపూర్ రాష్ట్రానికి వందల సంఖ్యలో వలసదారులు తరలివస్తున్నారు.
కేవలం రెండు రోజుల్లోనే సుమారు 700 మందికి పైగా మయన్మార్ వాసులు (Myanmar Nationals) మణిపూర్ లోకి ప్రవేశించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సరిహద్దు భద్రత బాధ్యతను నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్ (Assam Rifles) ను వివరణ కోరింది. సరైన పత్రాలు లేనివారిని భారత దేశంలోకి ప్రవేశించేందుకు ఏ విధంగా అనుమతించారని ప్రశ్నించింది. వారిని వెంటనే దేశం నుంచి పంపించేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినీత్ జోషీ సోమవారం రాత్రి అస్సాం రైఫిల్స్ కు లేఖ రాశారు.
జులై 22, 23 తేదీల్లో మయన్మార్ నుంచి అక్రమంగా 718 మంది దేశంలోకి చొరబడ్డారని లేఖలో తెలిపారు. వీసా, ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్ నుంచి ఎవరినీ మణిపూర్ లోకి అనుమతించొద్దని కేంద్ర హోం శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మయన్మార్ వాసులను మణిపూర్ లోకి అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
కాగా, అక్రమంగా మణిపూర్ లోకి ప్రవేశించిన 718 మందిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా జులై 22, 23 తేదీల్లో మణిపూర్ లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు. వీరిలో 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు, 209 మంది పురుషులు ఉన్నారు. మరోవైపు మణిపూర్ లో ఆందోళన కారులకు మయన్మార్ నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు గత నెలలో ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మణిపూర్ లోకి చొరబడిన మయన్మార్ జాతీయులు ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీసుకొచ్చారా..? లేదా..? అన్నది తెలియడం లేదు. ఈ విషయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
Also Read..
IRCTC | ఐఆర్సీటీసీ లో సాంకేతిక సమస్య.. నిలిచిన టికెట్ బుకింగ్ సేవలు
Devendra Fadnavis | త్వరలో మహా సీఎంగా అజిత్ పవార్..? క్లారిటీ ఇచ్చిన ఫడ్నవీస్
Manipur violence | మణిపూర్ అమానవీయ ఘటన.. మరో నిందితుడి అరెస్ట్