Manipur violence | మణిపూర్ (Manipur violence)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహిళల్ని ఊరేగించిన అమానవీయ ఘటన మణిపూర్లోని కంగ్పోప్కీ జిల్లాలో మే 4వ తేదీన జరిగింది. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో గత బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దీంతో ఘటనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేసి.. కిడ్నాప్, గ్యాంగ్ రేప్, మర్డర్ సహా పలు కేసులు బుక్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేయగా.. తాజాగా ఏడో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
వీడియో వైరల్ అయిన మరుసటి రోజు అంటే గత గురువారం ప్రధాన నిందితుడు హురైన హెరదాస్ సింగ్ సహా మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత శనివారం ఐదో నిందితుడు యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ (19)ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆరో నిందితుడు మైనర్ అని పోలీసులు తెలిపారు. ఇప్పుడు తాజాగా అరెస్ట్ చేసిన వ్యక్తితో కలిపి ఇప్పటి వరకూ ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మణిపూర్లో మెజారిటీ వర్గమైన మైతీలను గిరిజనుల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వటంతో మే 3న ఒక్కసారిగా జాతుల ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. హిందువులైన మెజారిటీ మైతీలకు, గిరిజనులైన మైనారిటీ కుకీ, నాగా మరికొన్ని జాతులకు మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. అప్పటి నుంచి ఈ గిరిజనులకు చెందిన చర్చిలను కూల్చేయటం, గ్రామాలను తగులబెట్టడం సర్వసాధారణం అయిపోయింది. మైతీ వర్గంలోని కొందరు భద్రతా బలగాల వద్ద ఆయుధాలను దొంగిలించి మారణహోమానికి పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా మే 4న దాదాపు వెయ్యిమంది మైతీలు కాంగ్పోక్పీ జిల్లాలోని బీ ఫైనోమ్ గ్రామంపై దాడిచేశారు. ఇండ్లన్నింటినీ తగులబెట్టారు. భయంతో పారిపోతున్న కుకీలను పట్టుకొని కొట్టి చంపేశారు.
ఈ మారణకాండకు భయపడి ఓ కుటుంబం అడవిలోకి పారిపోయింది. వారిని పోలీసులు రక్షించి స్టేషన్కు తీసుకెళ్తుండగా ఆ అల్లరిమూక అడ్డగించింది. ముగ్గరు మహిళలను, ఇద్దరు పురుషులను బలవంతంగా పోలీసుల నుంచి లాక్కెళ్లింది. మహిళల్లో 20 ఏండ్ల యువతితోపాటు 40, 50 ఏండ్లున్న మరో ఇద్దరు ఉన్నారు. వీరిని నగ్నంగా మార్చి ఊరేగించారు. యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆ యువతి తండ్రితోపాటు సోదరున్ని చంపేశారు. పోలీసుల కండ్లెదుటే జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మే 18న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ దారుణానికి పాల్పడినవాళ్లంతా మైతీ లీపున్, కాంగ్లీపాక్ కంబలూప్, అరంబై తెంగోల్, వరల్డ్ మైతీ కౌన్సిల్, షెడ్యూల్డ్ ట్రైబ్ డిమాండ్ కమిటీ తదితర మైతీ సంఘాలకు చెందినవారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దాదాపు 70 రోజులైనా బాధ్యులను పోలీసులు అరెస్టు చేయలేదు. తాజాగా వీడియో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఏడుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
Also Read..
Manipur | మణిపూర్ పై ఆరని మంటలు.. పార్లమెంట్ ఆవరణలో రాత్రంతా విపక్ష ఎంపీల నిరసన దీక్ష
Kamal Haasan | ప్రభాస్ ‘ప్రాజెక్ట్-కె’లో కమల్హాసన్ ఎందుకు నటిస్తున్నారో తెలుసా?