హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వాలు అప్పులు చేయడం చూస్తుంటాం. కార్పొరేట్ కంపెనీలు రుణాలు తీసుకోవడం గమనిస్తుంటాం. కానీ కాంగ్రెస్ సర్కార్ పాలనలో.. సీఎం విద్యాశాఖ మంత్రిగా గల తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీ అప్పులు తీసుకుంటున్నది. జీతాలు.. రోజువారి నిర్వహణ ఖర్చులకు ఇప్పటివరకు నాలుగు కోట్లు అప్పు చేసింది. నెలకు రూ.కోటి చొప్పున అప్పులు చేయనున్నది. ఇది వీరనారి చాకలి ఐలమ్మ పేరిట ఏర్పాటైన మహిళా వర్సిటీ పరిస్థితి. ఈ ఒక్క ఉదాహరణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పరిస్థితికి అద్దంపడుతున్నది. రాష్ట్రంలో ఏకైక మహిళా విశ్వవిద్యాలయమైన చాకలి ఐలమ్మ ఉమెన్ వర్సిటీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది.
ప్రభుత్వం గ్రాంట్స్ ఇవ్వకపోవడం.. ప్రత్యేకంగా నిధులేమీ లేకపోవడంతో యూనివర్సిటీని నడపడం కష్టంగా మారింది. ఆచార్యులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలివ్వలేని పరిస్థితికి దిగజారింది. ఫలితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అప్పుగా తీసుకుంటున్నది. కోఠి మహిళా కళాశాలను గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ మహిళా వర్సిటీగా అప్గ్రేడ్ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ వర్సిటీకి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేసింది.
2025లో ఈ వర్సిటీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఇచ్చింది. డిగ్రీ ఫస్టియర్లో 31 కోర్సులుండగా.. 1,850 సీట్లు, పీజీలో 37 కోర్సుల్లో 997 సీట్లున్నాయి. ఈ వర్సిటీని విశ్వవిద్యాలయంగా మార్చినప్పటి నుంచి అవసరమైన రెగ్యులర్ బోధనా పోస్టులను మంజూరుచేయలేదు. ఓయూ నుంచి ఈ వర్సిటీ సిబ్బందిని విభజించాల్సి ఉండగా, ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. నెలలు గడుస్తున్నా శాశ్వత సిబ్బంది.. మౌలిక వసతులు.. హాస్టల్స్ వంటి సౌకర్యాల కల్పన పూర్తికాలేదు.
యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్లో సర్కార్ రూ.500కోట్లు కేటాయించింది. రూ.400 కోట్లను హాస్టల్స్, అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి, రూ. 100 కోట్లు నిర్వహణ ఖర్చులకు కేటాయించింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. నిర్వహణ ఖర్చులకు కేటాయించిన వంద కోట్లలో సర్కార్ రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్సిటీ ఓయూ నుంచి అప్పు తీసుకుంటున్నది. పైగా ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో వర్సిటీకి రూ.15 కోట్లు రావాల్సి ఉన్నది. ఇవి రావడం లేదు. ఒకవైపు బ్లాక్ గ్రాంట్ విడుదల కాక.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలకాక ఆర్థిక చిక్కుల్లో వర్సిటీ సతమతమవుతున్నది. ఇక నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ను విద్యార్థుల ఖాతాల్లో వేస్తుండటంతో విద్యార్థులు కడతారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
యూనివర్సిటీకి ఫీజుల రూపంలో సమకూరే ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదు. పరీక్ష ఫీజులు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులు, ఫీజు రీయింబర్స్యేతర విద్యార్థులు చెల్లించే ఫీజులు సరిపోవడంలేదు. రెగ్యులర్ ఉద్యోగులకు నెలకు రూ.కోటి, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి నెలకు రూ.కోటి జీతాల రూపంలో వర్సిటీ చెల్లించాల్సి ఉంది. వర్సిటీకి వచ్చే ఫీజులు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, సిబ్బంది జీతాలకే సరిపోతున్నది.
ఈ నేపథ్యంలో విద్యార్థులపై అదనపు ఫీజులు వడ్డిస్తున్నారు. డిగ్రీలో ప్రవేశాలు పొందినవారి నుంచి రూ.1,200 చొప్పున ఫీజులు వసూలు చేశారు. వర్సిటీని ఇంకా కొన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. నీటి కటకట నెలకొనగా.. ప్రభుత్వ మెటర్నిటీ దవాఖాన నుంచి వచ్చే డ్రైనేజీ లైన్ వర్సిటీ నుంచే వెళ్తున్నది. పాత భవనాలను కూల్చివేయడంతో ప్రస్తుతం యూజీ, పీజీ విద్యార్థులకు షిఫ్ట్సిస్టమ్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. హాస్టల్ సరిపోకపోవడంతో తాత్కాలికంగా క్యాబిన్లు నిర్మించి 200 మందికి వసతి కల్పించారు.
యూనివర్సిటీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నది వాస్తవమే. జీతాలు చెల్లించేందుకు అవస్థలు పడుతున్నాం. ఓయూ నుంచి అప్పుగా తీసుకున్నవి మళ్లీ చెల్లిస్తాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన వంద కోట్ల నిధులు విడుదల చేయించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలైనా మాకు కాస్త ఉపశమనం లభించేది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం.
– ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్, వైస్ చాన్స్లర్