చండీగఢ్: నాణ్యతా లోపాల కారణంగా 125 మెట్రిక్ టన్నుల పాల పొడిని ఆర్మీ తిరస్కరించింది. నమూనాలలో ‘అదనపు పదార్థాలు’ ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. (Army rejects milk powder) పంజాబ్ రాష్ట్ర సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (మిల్క్ఫెడ్) వెర్కా బ్రాండ్ పేరుతో పాలపొడి, చీజ్, ఫ్లేవర్డ్ మిల్క్, ఇతర పాల ఉత్పత్తులను భారత సైన్యానికి రెగ్యులర్గా సరఫరా చేస్తుంది.
కాగా, జమ్మూలోని ఆర్మీ సర్వీస్ కార్ప్స్ యూనిట్ సుమారు 125 మెట్రిక్ టన్నుల పాలపొడిని తిరస్కరించింది. సరఫరా చేసిన పాలపొడికి సంబంధించిన రెండు బ్యాచ్ల్లో నాణ్యతా లోపాలున్నట్లు ఆరోపించింది. పాలపొడి నమూనాల్లో ‘అదనపు పదార్థాలు’ గుర్తించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న 58.338 మెట్రిక్ టన్నులు, మార్చి 16న 66.654 మెట్రిక్ టన్నుల పాలపొడిని ఆర్మీ తిరస్కరించింది. రక్షణ మంత్రిత్వ శాఖతోపాటు మిల్క్ఫెడ్కు ఈ మేరకు లేఖలు రాసింది.
మరోవైపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సీబీఐతో దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మిల్క్ఫెడ్ లూథియానా విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారులపై చర్యలు చేపట్టారు. నాణ్యతా నియంత్రణలో తీవ్రమైన లోపాలకు బాధ్యులుగా పేర్కొంటూ జనరల్ మేనేజర్ దల్జిత్ సింగ్, ప్రొడక్షన్ హెడ్ పరితోష్ మిశ్రా, క్వాలిటీ మేనేజర్ గురిక్బాల్ సింగ్ను శుక్రవారం సస్పెండ్ చేశారు.
Also Read:
Tamil Nadu Assembly polls | 164 స్థానాల్లో డీఎంకే పోటీ.. మిత్రపక్షాలకు 70 స్థానాలు
Watch: జీతం చెల్లించలేదని.. యజమాని కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన డంపర్ డ్రైవర్