Loksabha Elections 2024 : కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడమే కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమి విధానమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. విపక్షాలకు కుటుంబమే తొలి ప్రాధాన్యత అయితే తమకు కుటుంబం కంటే ముందు దేశమే ముఖ్యమని అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీలోని ద్వారకాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. గత పదేండ్లుగా తమ ప్రభుత్వం పేదల ఖాతాల్లోకి రూ. 36 లక్షల కోట్ల నగదు బదిలీ చేసిందని చెప్పారు. అదే కాంగ్రెస్ ఏలుబడిలో అయితే రూ. 31 లక్షలను దళారులు కాజేసేవారని అన్నారు.
కామన్ వెల్త్ గేమ్స్ సందర్భంగా దేశ ప్రతిష్టను ఇనుమడించాల్సిన సందర్భంలో అప్పటి పాలకులు అవినీతికి పాల్పడి ఢిల్లీని లూటీ చేశారని అన్నారు. తమ హయాంలో జీ20 సదస్సు సందర్భంగా ప్రపంచమంతా భారత్ను ప్రశంసించిందని గుర్తుచేశారు. ఇక బెంగాల్లో 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు.
ముస్లిం ఓటు బ్యాంక్ కోసం ముస్లిం కులాలకు ఓబీసీ సర్టిఫికెట్లను బెంగాల్ ప్రభుత్వం జారీ చేయడంతోనే ఈ తీర్పు వెలువడిందని అన్నారు. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు అన్ని పరిమితులను దాటాయని పేర్కొన్నారు. ఓట్ల కోసం విపక్షాలు వక్ఫ్బోర్డ్లకు భూములు ధారాదత్తం చేసి అందుకు ప్రతిగా వారి ఓట్లను కోరుతున్నాయని అన్నారు. దేశ బడ్జెట్లో 15 శాతం నిధులను మైనారిటీలకు కేటాయించాలని వీరు కోరుతున్నారని చెప్పారు. మతం ఆధారంగా బ్యాంక్ రుణాల మంజూరు, ప్రభుత్వ టెండర్ల కేటాయింపు కావాలని అడుగుతున్నారని ప్రధాని పేర్కొన్నారు.
Read More :