ఇంట్లో సౌకర్యాలు లేని కరోనా బాధితుల కోసం ఏర్పాటుకు చర్యలు
అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్
చిన్న ములుకనూర్, గుండ్లపల్లి, దేవంపల్లిలో పాఠశాలల భవనాల పరిశీలన
చిగురుమామిడి/ గన్నేరువరం/ మానకొండూర్ రూరల్, మే 23: కొవిడ్ బారిన పడిన గ్రామీణుల కోసం వైద్యం, ఇతర అన్ని వసతులతో ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన చిగురుమామిడి మండలం చిన్న ములుకనూర్ మోడల్ స్కూల్, గన్నేరువరం మండలం గుండ్లపల్లి మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాల, మానకొండూర్ మండలం దేవంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భవనాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయా చోట్ల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఇంట్లో కనీస సౌకర్యాలు లేని కరోనా బాధితులకు ఐసొలేషన్ సెంటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. వారికి వసతితోపాటు భోజన సదుపాయం కల్పిస్తామని చెప్పారు. చిన్న ములుకనూర్ ఐసొలేషన్ సెంటర్కు వచ్చే వారికి ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేసేందుకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ముందుకు వచ్చినట్లు తెలిపారు.
కలెక్టర్కు పూర్తిస్థాయి నివేదిక అందజేసి త్వరలోనే ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆయన వెంట డీపీవో వీరబుచ్చయ్యతో పాటు చిగురుమామిడి ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీఎంహెచ్వో సుధాకర్, చిన్న ములుకనూర్ సర్పంచ్ ముప్పిడి వెంకట నరసింహారెడ్డి, ఎంపీటీసీ పెసరి జమున, తహసీల్దార్ ముబీన్ అహ్మద్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో శ్రవణ్కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ అరుణ్కుమార్, మాజీ చైర్మన్ బరిగెల సదానందం, పంచాయతీ కార్యదర్శి హిమాయత్, గుండ్లపల్లిలో గన్నేరువరం మండల ప్రత్యేకాధికారి నాయక్, తహసీల్దార్ బండి రాజేశ్వరి, ఎంపీడీవో పీవీ నర్సింహారెడ్డి, మెడికల్ ఆఫీసర్ ఇందు, పంచాయతీ కార్యదర్శి లచ్చయ్య, దేవంపల్లిలో మానకొండూర్ జడ్పీటీసీ శేఖర్గౌడ్, డీఐవో డాక్టర్ సాజిదా అతహరి, ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, తహసీల్దార్ రాజయ్య, ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, మానకొండూర్, వెల్ది పీహెచ్సీల వైద్యులు రితేశ్, ఉదయ, సీహెచ్వో రాజూనాయక్, వైద్య సిబ్బంది ఉన్నారు.