Sandeshkhali | కోల్కతా, మే 9:లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు లైంగికదాడికి గురైన బాధితురాలిగా చెప్తున్న ఓ మహిళ తన ఫిర్యాదు వెనక్కు తీసుకున్నారు. ఈ మేరకు తన అత్తతో కలిసి ఆమె బుధవారం మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… జాతీయ మహిళా కమిషన్ తమ ప్రాంతానికి వచ్చిన రోజు పియాలి దాస్, మంపి దాస్ అనే మహిళలు తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయడానికి రావాలని చెప్పి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని తెలిపారు. ‘మాకు ఉపాధి హామీ పథకం డబ్బులు మాత్రమే రావాలని, ఆ డబ్బులు మాకు వస్తే చాలు, ఇంకా ఏం ఫిర్యాదులు లేవని పియాలికి చెప్పాం.
పియాలి మాతో ఖాళీ కాగితంపై సంతకం చేయించుకుంది. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ లీడర్లు రేప్ చేశారని చెప్తున్న బాధిత మహిళల జాబితాలో నా పేరు, మా అత్త పేరు కూడా ఉన్నాయని ఆ తర్వాత తెలిసింది. మాపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదు. ఈ ఆరోపణలు అబద్ధం’ అని సదరు మహిళ పేర్కొన్నారు. పియాలి బీజేపీకి చెందిన వ్యక్తి అని తమకు తర్వాత తెలిసిందని తెలిపారు. ఆమెకు సందేశ్ఖాలీలో ప్రతి ఒక్కరిపై సమాచారం ఉందని, అబద్ధాలు చెప్పి తమను ట్రాప్ చేసినందుకు పియాలిని శిక్షించాలని వారు పేర్కొన్నారు. తాము ఇప్పుడు బయటకు వచ్చి పియాలికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఇదే ఘటనకు సంబంధించి మరో వీడియో వైరల్గా మారింది. సందేశ్ఖాలీలో ఎలాంటి లైంగిక దాడులు జరగలేదని, సువేందు అధికారి ఆదేశాలతో ఫిర్యాదు చేసేలా మహిళలను ఒప్పించినట్టుగా సందేశ్ఖాలీ మండల బీజేపీ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న గంగాధర్ కోయల్ ఒప్పుకుంటున్నట్టుగా ఈ వీడియోలో ఉంది. ఓ న్యూస్ ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తృణమూల్ కాంగ్రెస్ చెప్తుండగా, ఈ వీడియోలో వాయిస్ ఎడిట్ చేశారని గంగాధర్ చెప్పుకొచ్చారు.
సందేశ్ఖాలీ ఘటనకు సంబంధించిన ఆరోపణలు కేవలం కల్పితమని, ఈ కుట్ర వేనుక సువేందు అధికారి ఉన్నారని ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోస్ గురువారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ కుట్ర వెనుక ఉన్న సువేందు అధికారి, ఇతర బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఇలాంటి తప్పుడు కథలను అల్లిందని, బీజేపీకి వ్యతిరేకంగా బయటకు వచ్చి మాట్లాడిన మహిళను ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని తృణమూల్ ఎంపీ సుష్మిత దేవ్ ఆరోపించారు. మరోవైపు, కేవలం నష్టనివారణ కోసం మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నదని బీజేపీ అధికార ప్రతినిధి ప్రియాంక తిబ్రేవాల్ ఆరోపించారు.