హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ‘భువన విజయం’ తెలంగాణ భవన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ భవన్ నిర్మించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. స్వ రాష్ట్ర ఆకాంక్షను చాటేలా.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టేలా ఉద్యమకారులకు ఒక వేదికగా, సరిగ్గా 20 ఏండ్ల క్రితం అద్భుత కట్టడంలా తెలంగాణ భవన్ ప్రారంభమైనట్టు గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో వ్యూహ, ప్రతివ్యూహాల రచనలో.. దశాబ్ద కాలపు స్వరాష్ట్ర అప్రతిహత ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ భవన్ది కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. ఇవాళ కాంగ్రెస్ విఫల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఓ ‘జనతా గ్యారేజ్’లా మారడంలో తెలంగాణ భవన్ సాక్షీభూతంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ భవన్ రెండు దశాబ్దాల పూర్తి సందర్భంగా ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
నాడు స్వరాష్ట్ర పోరులో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ వేదిక ‘తెలంగాణ భవన్’ అని హరీశ్రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. నేడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు కొండంత అండగా నిలుస్తూ.. వారి సమస్యలకు పరిష్కారం చూపే అసలైన ‘జనతా గ్యారేజ్’ అని అభివర్ణించారు. 20 ఏండ్లు పూర్తి చేసుకున్న ‘తెలంగాణ భవన్’ మన ఆత్మగౌరవ సూచిక అని హరీశ్రావు కొనియాడారు.