MLA Raja Singh | సూర్యాపేట, మే 9 (నమస్తేతెలంగాణ) : దేశంలో హిందూ జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే విషయమని, హిందూ జనాభా తగ్గితే దేశం మత ప్రాతిపదికన ముక్కలయ్యే ప్రమాదం ఉన్నదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. మోదీ సర్కారును మూడోసారి గెలిపించుకుంటే మత ఆధారిత జనాభా నియంత్రణ కోసం కొత్త చట్టం వస్తుందని తెలిపారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గంలో బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 1950 నుంచి 2015 వరకు మత ఆధారిత జనాభా పెరుగుదలపై ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చేసిన పరిశోధన అంశాలను ప్రస్తావించారు. భారత్లో హిందూ జనాభా 7.3 శాతం తగ్గిందని, ముస్లిం మైనార్టీ జనాభా 43 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఈ రకంగా హిందూ జనాభా తగ్గుతూ పోతే ఇండియా ఇస్లామిక్ దేశంగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఇది దేశానికి మంచి సంకేతం కాదని అన్నారు. అక్బర్, అసదుద్దీన్ ఒవైసీలు ఎన్నికల సమయంలో విద్వేష ప్రకటనలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఈయన వెంట ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి, బీజేపీ ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు ఉన్నారు.