యాదాద్రి భువనగిరి, మే 9 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి దేశంలోనే అత్యంత అబద్ధాలు చెప్పే సీఎం అని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నా రు. బీజేపీ భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో గురువారం నిర్వహించిన జనసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెల ంగాణలో రాహుల్ బాబా హామీ లు నెరవేరలేదని, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ సరిగ్గా అమలు చేయలేదని అన్నారు. సోనియాగాంధీ జన్మదినానికి తెలంగాణ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట తప్పారని విమర్శించారు. ధాన్యానికి రూ.500 బో నస్, విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు విద్యా రుణాలు అమలు చేయలేదని మండిపడ్డారు. హస్తం పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదని, పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తికి భువనగిరి టికెట్ కేటాయించారని అన్నారు. నరేంద్ర మోదీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి చూపించారని తెలిపారు. ఇవి రాహుల్ గ్యారెంటీ, మోదీ గ్యారెంటీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్రావు, పార్టీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణరెడ్డి, పడాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ పాల్గొన్నారు.