హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 9 (నమస్తే తెలంగాణ)/బడంగ్పేట: సీఎం రేవంత్రెడ్డి ఐదు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, అందుకే రుణమాఫీపై కనిపించిన దేవుడి మీద ఒట్టు పెడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. సీఎం వస్తుండంటే గుడిలోని దేవుడు కూడా భయపడుతున్నాడని, రేవంత్ ఎక్కడ ప్రమాణం చేస్తాడోనని గుడి నుంచే పారిపోయే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చాలంటే నాయకుడికి చిత్తశుద్ధి ఉండాలని, పాలన గాలికొదిలేసి దేవుడి మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆమె ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. హస్తిన టూర్లలో ఐదు లోక్సభ స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రధాని మోదీతో సీఎం రేవంత్కు ఒప్పందం కుదురిందని ఆరోపించారు. బడేభాయ్-చోటేభాయ్ వ్యాఖ్యలతో పాటు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డిని కాంగ్రెస్ సీఎం రేవంత్ ‘మంచోడు’ అని కొనియాడడం అందులో భాగమేనన్నారు. మ ల్కాజిగిరికి సునీతా మహేందర్రెడ్డిని పంపించడం కూడా ఈ ఒప్పందంలోని వ్యూహమని చెప్పారు. ఇంకా వివరాలు ఆమె మాటల్లోనే…
సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ టూర్కు వెళ్లిన సందర్భాల్లోనే ప్రధాని మోదీతో ఐదు లోక్సభ స్థానాలపై చీకటి ఒప్పందం జరిగిందనేది మాకు పక్కా సమాచారం. కాంగ్రెస్ సీఎం అ యి ఉండి కూడా చేవెళ్ల సభలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి చాలా మంచోడు అని పొగిడారు. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి సహకరించాలనే స్పష్టమైన సంకేతాన్ని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చారు. మల్కాజిగిరిలోనూ బీజేపీకి సహకరించేందుకు సీఎం రేవంత్రెడ్డి ఒప్పం దం చేసుకున్నారు. ఇది బయటపడొద్దనే మాజీ సీఎం కేసీఆర్ బీజేపీతో మిలాఖత్ అయ్యాడని నిందలు వేస్తున్నారు. బాలాపూర్ సభలోనూ నాపై నిందలు వేయ డం హాస్యాస్పదం. ఒక మహిళ అని చూడకుండా నేను బీజేపీ వాళ్లతో కలుస్తున్నానని నీచంగా మాట్లాడారు. ఇంద్రారెడ్డి కుటుంబ చరిత్ర తీసుకుంటే ఆనాడు ఎన్టీఆర్… ఆపై వైఎస్సార్… ఇప్పుడు కేసీఆర్… అధికారం వైపు కాకుండా నమ్ముకున్న నాయకుడివైపు నిలబడిన కుటుంబం మాది.
ఆరు నెలల వ్యవధిలోనే రెండు ఎన్నికలకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేశాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజల దగ్గరకు వెళ్లినపుడు గుప్పెడు మందిలో వ్యతిరేకత ఉన్నా కనిపించలేదు. అప్పుడు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందున్నాయి. కానీ పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేస్తున్నపుడు మాకంటే ముందు ప్రజలే స్పందిస్తున్నరు. రైతుబంధు రాలేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, మేం కాంగ్రెస్ చేతిలో మోసపోయాం అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వృద్ధురాలు వచ్చి ‘అమ్మా… పింఛను రూ.4వేలన్నరు. ఇప్పుడు ఆ రూ. 2 వేలు కూడా వస్తలేవు’ అని ఏడ్చిం ది. ఒక రైతు వచ్చి ‘రంజిత్రెడ్డి కేసీఆర్ సార్ను మోసం చేసిండు. మీరు గట్టిగ చూసుకోవాలి’ అని చెప్పాడు. ప్రజలు కాంగ్రెస్ మోసాన్నే కాదు… రంజిత్రెడ్డిలాంటి నేతల మోసాన్ని కూడా గమనిస్తున్నరు. అందుకే బీఆర్ఎస్ సమావేశాలకు స్వచ్ఛందంగా తరలివస్తున్నరు.
ఇది పేరుకే జాతీయ ఎన్నికలు. రాష్ట్రంలో మాత్రం కేసీఆర్, రేవంత్రెడ్డి పాలనలో వ్య త్యాసాలను ప్రతి ఓటరు నిశితంగా పరిశీలిస్తున్నరు. కేంద్రం నుంచి రాష్ర్టానికి ఏమైనా పెద్ద ప్రాజెక్టు వచ్చినా, సామాన్యుడికి పెద్ద మేలు జరిగినా చర్చ జరిగేది. బీజేపీ వాళ్లకు చెప్పుకునేందుకు ఏమీలేదు. అందుకే ఉచిత రేషన్ ఇస్తున్నామని ప్రచారం చేసుకునే స్థాయికి దిగజారిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధిని కూడా తాను చేసినట్టు చూపించుకునే దౌర్భాగ్య పరిస్థితి. బీజాపూర్-మన్నెగూడ జాతీయ రహదారి కూడా కేసీఆర్ అనేకసార్లు ఢిల్లీ వెళ్లి సాధించిన ప్రాజెక్టు.
రంజిత్రెడ్డి ఎవరో తెలియని రోజుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన్ని చేవెళ్ల ఎంపీగా చేశారు. ఐదేండ్లు రంజిత్రెడ్డి ఎప్పుడు చూసి నా కేసీఆర్, కేటీఆర్కు కుడి, ఎడమగానే తిరిగారు. కానీ రంజిత్రెడ్డి బీఆర్ఎస్, కేసీఆర్కు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయినపుడు ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయంలో.. ఇంకోవైపు రంజిత్రెడ్డి నవ్వుకుంటూ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం సామాన్య ప్రజల్ని ఎంతో కలచివేసింది. కార్యకర్తలు ఒత్తిడి తెస్తే పోయినట్టు రంజిత్రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ నిజమైన కార్యకర్త పార్టీ కష్ట సమయంలోనూ వెన్నంటి ఉంటడు. అయినా పార్టీ మారితే కార్యకర్తల్ని సమన్వయం చేసుకోలేని వ్యక్తి నాయకుడు ఎలా అవుతాడు?
చేవెళ్లలో దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్, బీజేపీ కలిసి పక్కనపడేశాయి. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి తన సొంతగడ్డకు చెందిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని ఏనాడైనా పార్లమెంటులో అడిగారా? ఇప్పుడు సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కాల్వల నిర్మాణానికి పిలిచిన రూ.5వేల కోట్ల టెండర్లనూ రద్దు చేశారు. కొడంగల్కు మాత్రం లిఫ్టును తెచ్చుకుంటున్నారు. అలాంటప్పుడు చేవెళ్ల పార్లమెంటు ప్రజలు కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి? 2014 ఎన్నికల ప్రచారంలో పాలమూరు ప్రాజెక్టును చేపడతానని చెప్పిన ప్రధాని మోదీ ఇప్పటివరకు కృష్ణాజలాల కేటాయింపుల్ని పూర్తి చేయకపోగా, కేటాయింపులు లేవని పాలమూరు ప్రాజెక్టుకు కేంద్ర నిధుల్ని కూడా ఇవ్వడంలేదు. మరి బీజేపీకి చేవెళ్ల ప్రజలు ఎందుకు ఓటేయాలి? కేసీఆర్ ఉంటే ఇప్పటివరకు కాల్వల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యేదని రైతులే స్వయంగా మాకు చెబుతున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని చేవెళ్ల నుంచి మొదలుపెట్టారు. అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాష్ట్రంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే అత్యధిక స్థానాలను కచ్చితంగా కైవసం చేసుకుంటాం. చేవెళ్లలో మా అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కావడం ఎంతో కలిసి వస్తుంది. 96 బీసీ కులాలను ఏకం చేసిన ఘనత ఆయనది. జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా చేవెళ్ల ప్రజలకు ఆయన సుపరిచితుడు. మా కార్యకర్తలు, ఏడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కష్టపడి సమష్టిగా పని చేస్తున్నాం. అందుకే కచ్చితంగా చేవెళ్లలో భారీ మెజార్టీతో కాసాని గెలవబోతున్నారు.