హుజూర్నగర్, ఆగస్టు 14 : శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని హుజూర్నగర్ మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్కు నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపుపై తెలంగాణ మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతులకు సాగునీరు అందకుండా చేసి ఆంధ్రా రైతులకు నీటిని తరలించడం ఎంతవరకు సమంజసమన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ నీటిని వినియోగిస్తోందని, ఇదే అంశాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ప్రస్తుతం రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను సక్రమంగా వినియోగించకపోతే భవిష్యత్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని అన్నారు. రైతుల పంటలు ఎండిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నీటి వినియోగంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలపై రాజీ పడవద్దని సూచించారు. రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, పార్టీ సీనియర్ నాయకులు కె ఎల్ ఎన్ రెడ్డి, సారెడ్డి భాస్కర్ రెడ్డి, భూక్యా నగేష్ రాథోడ్, షేక్ అలీ, ములకలపల్లి రాంబాబు, కోలపూడి చంటి, ఎస్ కె రహీమా, తుమ్మకొమ్మ సుందర్ రావు, మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.