అమరావతి : ఏపీలో అమరావతి( Amaravati ) రాజధాని పేరిట జరుగుతున్న దోపిడీని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) రాష్ట్ర ప్రజానికానికి పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. అమరావతి నిర్మాణ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా అప్పులు సైతం చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి అద్భుత నగరమంటూ ప్రచారం చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవలంభిస్తున్న విధానాల వల్ల అమరావతి ఎప్పటికీ పూర్తి కాదని పేర్కొన్నారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో రోడ్ల నిర్మాణంలో కిలోమీటర్ రోడ్డుకు రూ.180 కోట్లు ఖర్చు చేయడం దారుణమని అన్నారు. అమరావతిలో జరుగుతున్న వ్యయాలపై ప్రజలు, మేధావులు ఆలోచించి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. అప్పులు తీసుకువచ్చి వాటిలోనూ కమీషన్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.