PM Modi | దేశ ప్రజలపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మెన్ సామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. శరీర రంగును చూసి ప్రజలను అవమానిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. నల్లటి చర్మం కలిగిన శ్రీకృష్ణుడి భూమి ఇది అని, ఆయన్ను ఇక్కడ పూజిస్తున్నామని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యలకు కాంగ్రెస్ యువరాజు (రాహుల్ను ఉద్దేశిస్తూ) (Rahul Gandhi ) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చర్మం రంగు ఆధారంగా మన దేశ ప్రజలను అగౌరవపరచడాన్ని ఎన్నటికీ సహించేది లేదని ప్రధాని తేల్చి చెప్పారు.
ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ద్రౌపది ముర్ముని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందో తనకు ఇప్పుడు అర్థమైందని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ద్రౌపది ముర్ముని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందని నేను అప్పుడు ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఆదివాసి అయిన ముర్మును కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడించాలని ప్రయత్నించిందో ఇప్పుడు అర్థమైంది. ద్రౌపది ముర్ము గారి చర్మం రంగు నలుపు.. ఇక్కడ ఉన్న రాజకుమారిడికి (రాహుల్ను ఉద్దేశిస్తూ) అమెరికాలో ఓ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ ఉన్నారు (పిట్రోడాను ఉద్దేశిస్తూ). ఆయన ఇటీవలే ఓ మాట చెప్పారు. చర్మం నల్లగా ఉన్నవారంతా ఆఫ్రికన్లు అని. అంటే చర్మం రంగును బట్టి ద్రౌపది ముర్ముగారిని ఆఫ్రికన్ అని కాంగ్రెస్ వాళ్లు భావించి ఉంటారు. అందుకే ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆమెను ఓడించాలని కాంగ్రెస్ పార్టీ భావించి ఉంటుంది. దేశంలో చాలా మందికి నలుపు చర్మం ఉంటుంది. ఈ నలుపు ఎక్కడి నుంచి వచ్చిందనేది అర్థం చేసుకోవాలి. భగవాన్ శ్రీకృష్ణుడు రంగు నీలం, నలుపు’ అని మోదీ పేర్కొన్నారు.
ఇటీవలే వారసత్వ పన్ను గురించి కామెంట్ చేసి వివాదంలో ఇరుక్కున్న సామ్ పిట్రోడా (Sam Pitroda).. తాజాగా భారత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. దక్షిణ భారతంలో ఉన్న వాళ్లు ఆఫ్రికన్లుగా, తూర్పున ఉన్నవాళ్లు చైనీయులుగా, పశ్చిమంలో ఉన్నవాళ్లు ఆరబ్బులుగా కనిపిస్తున్నారని పిట్రోడా వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 75 ఏళ్లుగా ప్రజలు సంతోషకర వాతావరణంలో బ్రతికారని, అక్కడక్కడ చిన్నచిన్న స్పర్థలు తప్ప ఏమీలేవని ఆయన అన్నారు. భారత్లో ఉన్న ప్రజాస్వామ్యం గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ.. భారత్ భిన్నత్వ దేశమని, కానీ అందరూ కలిసికట్టుగా ఉంటారని, తూర్పున ఉన్నవాళ్లు చైనీయులుగా, పశ్చిమంలో ఉన్నవాళ్లు అరబ్బులుగా, ఉత్తరంలో ఉన్నవాళ్లు శ్వేతజాతీయులుగా, దక్షిణంలో ఉన్న వాళ్లు బహుశా ఆఫ్రికన్లుగా కనిపిస్తారని పిట్రోడా పేర్కొన్నారు. భారత దేశ ప్రజలు భిన్న భాషలను, మతాలను, ఆహారాన్ని, ఆచారాలను గౌరవిస్తారన్నారు. భారత్లో ప్రతి ఒక్కరికీ స్థానం ఉందని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో కాంప్రమైజ్ అవుతుంటారని ఆయన తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ సహా కాంగ్రెస్లోని పలువురు నేతలు కూడా మండిపడుతున్నారు.
Also Read..
Rajasthan | ట్రక్కు డ్రైవర్ ఘోర తప్పిదం.. రోడ్డు ప్రమాదంలో కుటుంబం బలి
Bomb Attack | దేవుడికి దండం పెట్టుకుని.. ఇంటిపై బాంబులు విసిరి.. షాకింగ్ వీడియో