జమ్ము: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో మరో మోసానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాల్పడింది. ఇటీవల భూ ఆక్రమణల డ్రైవ్ చేపట్టిన పాలక యంత్రాంగం తాజాగా ప్రజలపై పన్నుల భారం మోపేందుకు సిద్ధమైంది. నివాస, వాణిజ్య ఆస్తులపై ఏప్రిల్ నుంచి ఆస్తి పన్ను (Property Tax ) విధించనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా నేతృత్వంలోని పరిపాలనా యంత్రాంగం ఇటీవల నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. శనివారం జమ్ములో పూర్తి స్థాయి బంద్ (Shutdown In Jammu) పాటించారు. జమ్మూ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (సీసీఐజే) పిలుపునిచ్చిన బంద్కు అనేక సంఘాలు మద్దతు ఇచ్చాయి. షాపులు, వ్యాపార సముదాయాలను మూసివేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టి బొమ్మలను దహనం చేశారు. జమ్ముకశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా ఈ బంద్కు మద్దతు తెలిపింది. దీంతో శనివారం కోర్టు వ్యవహారాలు నిలిచిపోయాయి.
కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ప్రజలతోపాటు రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఎన్నికైన ప్రభుత్వం లేకుండా ఎల్జీ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. జమ్ముకశ్మీర్ను బలవంతంగా విభజించడంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల ప్రజలపై ప్రభావం చూపుతున్నదని ఆరోపిస్తున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకుండా ప్రజలపై ఆస్తి పన్ను భారం మోపడం సరికాదని మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా దుయ్యబట్టారు. జమ్ముకశ్మీర్ను అక్రమంగా విభజించిన కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
మరోవైపు ఆస్తి పన్ను విధింపుపై లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా తీసుకున్న నిర్ణయాన్ని జమ్మూ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు అరుణ్ గుప్తా తప్పుపట్టారు. ఎవరినీ సంప్రదించకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. సామాన్య ప్రజల మనోభావాలు, బాధల గురించి కేంద్ర పరిపాలనా యంత్రాంగానికి పట్టడం లేదని దుయ్యబట్టారు.
కాగా, జమ్ము బంద్పై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో దేశంలోనే చాలా తక్కువగా ఆస్తి పన్నులు ఉన్నాయని తెలిపారు. ప్రజల ప్రయోజనాలు తమకు ముఖ్యమని చెప్పారు. ఆస్తి పన్ను విధింపుపై చర్చకు తాను సిద్ధమేనని ఆయన అన్నారు.