Adani Group | ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. అదానీ గ్రూప్తో సమావేశమైంది. అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడులు సగానికి పైగా కరిగిపోయిన దశలో.. ఉన్నవాటిని ఎల్ఐసీ వెనక్కి తీసుకుంటుందేమోనన్న వార్తలూ వెలువడ్డాయి. కానీ చర్చల అనంతరం ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ అనూహ్య ప్రకటన చేశారు. అదానీ గ్రూప్పై తమకు నమ్మకం మరింత పెరిగిందంటూ, అందులో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రకటించారు.
అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాదీ అదే మాట. అదానీ సంస్థలు కోరితే మరిన్ని పెట్టుబడులను పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని బ్యాంక్ సీఈవో, ఎండీ సంజీవ్ చద్దా ఇప్పటికే ప్రకటించారు. చివరకు అదానీ గ్రూప్ ఆధ్వర్యంలోని వివాదాస్పద ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్టుకూ అప్పులిస్తామని ప్రకటించారు.
క్రెడిట్ రేటింగ్ చూసి కానీ సామాన్యుడికి పైసా అప్పివ్వని బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు.. అదానీ ఆర్థిక సామ్రాజ్యం నిట్టనిలువుగా కూలుతున్నా లోన్లు ఇస్తామంటూ ఎందుకు ఎగబడుతున్నాయి? కోట్లాదిమంది ప్రజల సొమ్మును ఆవిరవుతున్న మార్కెట్లోకి నెట్టేంత అనివార్యత ఏమిటి? ఏ అదృశ్యశక్తి వాటిని ఆడిస్తున్నది? ఆదేశిస్తున్నది?
ఇప్పుడు అన్ని వేళ్లూ కేంద్రం వైపే చూపుతున్నాయి. హిండెన్బర్గ్ దెబ్బకు పునాదులు కదిలిన అదానీ సామ్రాజ్యానికి మరమ్మతులు చేసే పనిలో పడింది కేంద్ర సర్కారు. అక్రమాల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న వ్యాపా ర సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలు అండగా నిలు స్తుండటం, ఆ గ్రూప్ ప్రతినిధులను సర్కారీ సంస్థల పెద్దలు కలుస్తుండటమే ఇందుకు నిదర్శనం. అదానీ గ్రూప్ ఎదుగుదలలో బీజేపీ ముఖ్యనేతలు కీలకపాత్ర వహించారన్న వార్తల నడుమ.. ఇప్పుడు కష్టాల్లోపడ్డ అదే అదానీ గ్రూప్ ను గట్టెక్కించడంలోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాన భూమిక పోషిస్తున్నదన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ, మార్చి 10: అమెరికన్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రిపోర్టుతో కుప్పకూలిన అదానీ గ్రూప్ను నిలబెట్టేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నదా?.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఒకవైపు పెట్టుబడులు ఆవిరవుతుంటే.. మరోవైపు ప్రభుత్వరంగంలోని బ్యాం కింగ్, నాన్-బ్యాంకింగ్ సంస్థల పెద్దలు అదానీ గ్రూప్ విశ్వసనీయతకు, ఆర్థిక పరిపుష్ఠికి ఫస్ట్ క్లాస్ మార్కులిస్తుండటం గమనార్హం. అధికారాన్ని అడ్డుపెట్టుకునే అదానీకి ప్రభుత్వ సంస్థల ద్వారా అందాల్సిన సాయాన్ని ఢిల్లీ పెద్దలు అనే క మార్గాల్లో అందిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టి.. భారీగా నష్టాలను మూటగట్టుకున్న భారతీయ జీవితబీమా సంస్థ (ఎల్ఐసీ) ఇంకా బీరా లు పలుకుతూనే ఉన్నది. అదానీ గ్రూప్ ఆర్థిక పరిపుష్టిపై తమకు అనుమానాలేవీ లేవని, మరి న్ని పెట్టుబడులకూ సిద్ధమని నమ్మబలుకుతున్న ది. ఇక ఎన్ని కోట్ల రుణాలైనా ఇచ్చేందుకు తా ము సిద్ధమేనని బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్తున్నది.
దేశంలోని ప్రధాన ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. అదానీ గ్రూప్లో తమ పెట్టుబడులకు ఢోకా లేదని స్పష్టంచేసింది. అదానీ సంస్థలు కోరితే మరిన్ని పెట్టుబడులనూ పరిశీలిస్తామని బ్యాంక్ సీఈవో, ఎండీ సంజీవ్ చద్దా అన్నారు. చివరకు అదానీ గ్రూప్ ఆధ్వర్యంలోని వివాదాస్పద ధారావీ రీడెవలప్మెంట్ ప్రాజెక్టుకూ అప్పులిస్తామని ప్రకటించా రు. నిజానికి హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ నష్టాల మధ్య ఆ కంపెనీల క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. బాండ్ల మార్కెట్లో నూ ప్రతికూల పరిస్థితులే. అయినప్పటికీ బీవోబీ సారథి.. అదానీకి ఇంత భరోసా ఎలా ఇవ్వగలిగారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
అదానీ గ్రూప్ సంపద పెరిగేందుకు పెట్టుబడులపరంగా మోదీ సర్కారు ఏవిధంగా దోహదపడిందో బ్లూంబర్గ్, రాయిటర్స్ వంటి ప్రముఖ మీడియా సంస్థల కథనాలే చెప్తున్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక తదితర పొరుగు దేశాలతోపాటు ఆస్ట్రేలియాతో లోపాయికారి ఒప్పందాలను చూస్తూనే ఉన్నాం. దేశీయంగానూ ఓడరేవుల నుంచి విమానాశ్రయాలు, బొగ్గు గనులదాకా అదానీకి కట్టబెట్టారంటూ ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నది కనిపిస్తూనే ఉన్నది. ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్లలో కరిగిపోయిన అదానీ గ్రూప్ సంపదను తిరిగి పెంచేందుకూ మోదీ సర్కారు రకరకాల ప్రయత్నాలను చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గౌతమ్ అదానీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి విధానపరమైన అండదండలు దండిగా ఉన్నాయన్నది నిజమని మెజారిటీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అందుకే అనతికాలంలోనే అంబానీలను వెనక్కినెట్టి అపర కుబేరుడిగా అవతరించాడంటున్నారు. కానీ అసలు రహస్యం బయటపడేసరికి అదానీ అందలం దిగొస్తున్నారు.
లండన్, దుబాయ్తోపాటు అమెరికా లోని పలు నగరాల్లో అదానీ గ్రూప్ పెట్టుబడుల కోసం రోడ్షోలను నిర్వహిస్తున్నది. ఈ నెల 7న మొదలైన ఈ రోడ్షోలు.. 15దాకా కొనసాగనున్నాయి. విదేశీ మదుపరులను ఆకర్షించి హిండెన్బర్గ్ దెబ్బకు జరిగిన డ్యామేజీని పూడ్చుకోవాలని అదానీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 24న హిండెన్బర్గ్ రిపోర్టు విడుదలైన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ సంస్థలు అవకతవకలకు పాల్పడుతున్నాయని, అందుకే వాటి సంపద అడ్డగోలుగా పెరుగుతున్నదని అందులో చెప్పింది. దీంతో పది రోజుల్లోనే పది లక్షల కోట్ల రూపాయలదాకా అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఆవిరైపోయింది. మదుపరులు భారీ ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారం ఇటు దేశీయ స్టాక్ మార్కెట్లను, అటు పార్లమెంట్నూ కుదిపేయగా.. చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు అదానీ గ్రూప్ వ్యవహారంతో వాటిల్లిన నష్టం గురించి అందరికీ తెలిసిందే. అదానీ గ్రూప్ లోని ఏడు సంస్థల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టింది. ఒకానొక దశలో ఈ పెట్టుబడుల గరిష్ఠ విలువ రూ.81,000 కోట్లపైనే. ఇప్పుడు ఇందులో సగానికిపైగా కరిగిపోయింది. అయినప్పటికీ అదానీ గ్రూప్పై తమకు విశ్వాసం ఉన్నదని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ చెప్తుండటం విశేషం. నిజానికి పెట్టుబడులు పెట్టిన ఏ సంస్థ అయినాసరే.. సదరు కంపెనీ నష్టాల్లోకి జారుకుంటుంటే పెట్టుబడులను వెనక్కితీసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎల్ఐసీ మాత్రం తీరిగ్గా అదానీ గ్రూప్ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నది. పైగా అదానీ గ్రూప్ వ్యాపార అవకాశాలపై ఇప్పుడే తమకు మరింత నమ్మకం పెరిగిందని ఈ చర్చల అనంతరం ఎల్ఐసీ చైర్మన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ క్రమంలోనే అవసరమైతే మరిన్ని పెట్టుబడులకు సిద్ధమని అదానీకి భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తున్నది.
నిధుల కోసం అదానీ గ్రూప్ కటకటలాడుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన బోటిక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీక్యూజీ పార్ట్నర్స్ నుంచి సమీకరించిన రూ.15,446 కోట్ల పెట్టుబడుల్లో సగం మార్జిన్ కాల్స్కే అదానీ గ్రూప్ వినియోగించిందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా విమర్శిస్తున్నారు. తాకట్టు షేర్లకు సంబంధించి మార్జిన్ కాల్స్ చెల్లింపుల కోసం రూ.7,374 కోట్లను వాడిందని ఆమె పేర్కొన్నారు. దీంతో గ్రూప్ కంపెనీల్లో వాటాలను విక్రయించి మరీ అవసరాలను తీర్చుకునేదాకా అదానీ గ్రూప్ వచ్చిందా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. బ్రోకరేజీ ఖాతాలో నిర్ణీత స్థాయి దిగువకు సెక్యూరిటీల విలువ పడిపోతే.. దాన్ని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే నష్టాలను పూడ్చేందుకు అదనంగా నగదు లేదా సెక్యూరిటీలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే ‘మార్జిన్ కాల్’ అంటారు.