న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని దాటింది. దేశవ్యాప్తంగా 70 కోట్లమందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. కేవలం 13 రోజుల్లోనే 10 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలను అభినందించారు.
దేశంలో 10 కోట్ల వ్యాక్సిన్లను పంపిణీ చేయడానికి 84 రోజులు పట్టిందని, 20 కోట్లకు చేరుకోవడానికి 45 రోజులు పట్టిందని తెలిపారు. ఈ సంఖ్య 30 కోట్లకు చేరుకోవడానికి మరో 29 రోజులు, 40 కోట్లకు పెరగడానికి 24 రోజులు పట్టిందన్నారు. ఇక ఆగస్టు 6 నాటికి 50 కోట్లకు చేరిందని, దానికి మరో 20 రోజులు తీసుకున్నదని వెల్లడించారు. 19 రోజుల్లోనే ఈ సంఖ్య 60 రోజులకు చేరిందని తెలిపారు. ఇది కేవలం 13 రోజుల్లోనే 70 కోట్లకు దాటిందని మంత్రి పేర్కొన్నారు.
ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 53,96,20,217 మంది మొదటి డోసు, 16,67,35,579 మంది రెండో డోసు కూడా తీసుకున్నారు. ఇందులో 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉన్నవారు 28,12,08,799 మంది మొదటిడోసు, 3,72,19,545 మంది రెండు డోసులు వేసుకున్నారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమయ్యింది. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక మార్చి 1న మూడో విడత వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. ఇందులో 60 ఏండ్లు పైబడినవారికి, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏండ్లు పైబడినవారికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు పైబడినవారికి, మే 1 నుంచి 18 ఏండ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు.