భోపాల్ : మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అనంతరం ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఈవీఎంలపై సందేహం వ్యక్తం చేయడం పట్ల బీజేపీ మండిపడింది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో దిక్కుతోచని స్ధితిలో ఆ పార్టీ ఈవీఎంలను నిందిస్తోందని కాషాయ పార్టీ ఎద్దేవా చేసింది. చిప్ ఉన్న ఏ మెషీన్ను అయినా హ్యాక్ చేయవచ్చని, 2003 నుంచి తాను ఈవీఎంలతో ఓటింగ్ను వ్యతిరేకిస్తున్నానని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కూడా అయిన దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) తోసిపుచ్చారు. ఓటమి ఎదురైన తర్వాతే కాంగ్రెస్ ఈ ఆరోపణలు గుప్పిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తెలంగాణలో గతంలో హిమాచల్ ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో విజయం సాధించినప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడలేదని అన్నారు. సనాతన ధర్మాన్ని మీరు విమర్శిస్తే కాంగ్రెస్ పరిస్ధితి ఇలాగే ఉంటుందని ఆ పార్టీ నేత ప్రమోద్ కృష్ణ సరిగ్గా చెప్పారని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు.
ఇండియా పేరిట ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ఫ్రంట్ విపక్ష కూటమి కాదని, అది అహంకార కూటమి అని అది కుప్పకూలడం ఖాయమని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. మరోవైపు ఈవీఎంల పనితీరుపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ఈవీఎంల స్ధానంలో బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Read More :