భోపాల్: ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే నర్సును ఒక వ్యక్తి హత్య చేశాడు. గన్తో ఆమెపై కాల్పులు జరిపి చంపాడు. (Nurse Shot Dead) ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. నర్సు హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. షాగఢ్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 25 ఏళ్ల దీప్శిఖా చదర్ స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నది. బుధవారం రాత్రి 8 గంటలకు ఆమె ఆసుపత్రికి చేరుకున్నది. నైట్ డ్యూటీ కోసం సిద్ధమవుతున్నది.
కాగా, ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద నర్సు దీప్శిఖా ఉన్నది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. నర్సును కిందకు తోసి గన్తో మూడు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు. రక్తపు మడుగులో కుప్పకూలిన దీప్శిఖా అక్కడికక్కడే మరణించింది. ఈ విషయం తెలుసుకుని స్థానికులు భయాందోళన చెందారు.
మరోవైపు ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. నర్సు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఆమె హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే జబల్పూర్లోని కటంగి పటాన్ ప్రాంతానికి చెందిన యువకుడు ఆ నర్సును హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీప్శిఖా నివసిస్తున్న షాగఢ్లోని ప్రాంతంలోనే ఫ్రెండ్తో కలిసి అతడు నివసిస్తున్నాడు.
కాగా, ఆ యువకుడు, దీప్శిఖా మధ్య పరిచయం ఉన్నట్లు తెలుస్తున్నది. పెళ్లి కోసం అతడు ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించడంతో ఈ హింసాత్మక చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడి అరెస్ట్ కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Also Read: