జిన్నారం, జూన్ 29 : గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం మంచి అవకాశమని, సర్పంచ్లు, కార్యదర్శులు పది రోజులు ప్రణాళికతో పనులు చేపట్టాలని డీఎల్పీవో సతీష్రెడ్డి అన్నారు. జూలై ఒకటవ తేదీ నుంచి ప్రారంభమయ్యే నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు విడుతల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల ప్రధాన సమస్యలన్నీ పరిష్కారమయ్యాయన్నారు. ప్రస్తుతం ప్రారంభమయ్యే కార్యక్రమంతో గ్రామాల్లో నెలకొన్న మిగతా సమస్యలు కూడా పరిష్కారం కావాలన్నారు. అంతకు ముందు మాదారం, కొడకంచి, వావిలాల, లక్ష్మీపతిగూడెం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల సమస్యలను గుర్తించి వాటిని వెం టనే పరిష్కరించాలన్నారు. ఇంతమంచి కార్యక్రమాన్ని సర్పంచ్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో సుమతి, ఎంపీవో రాజ్కుమార్, సర్పంచ్లు, కార్యదర్శులు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
పల్లెప్రగతిని విజయవంతం చేయాలి
పల్లెప్రగతి కార్యక్రమాలను ప్రతి గ్రామంలో విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు కృషి చేయాలని ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మండల అధికారుల సమావేశంలో ఎంపీపీతో పాటు జడ్పీటీసీ కుమార్గౌడ్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీవో దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై1వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు పల్లెప్రగతి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, స్వచ్ఛంద సంఘాలు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు కలిసి పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.