Sonia Gandhi | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 141 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ (MPs Suspension) చేయడంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తాజాగా స్పందించారు. ఈ అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్య గొంతు నొక్కేస్తోందని దుయ్యబట్టారు. మునుపెన్నడూ లేనివిధంగా పార్లమెంట్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘సహేతుకమైన, చట్టబద్ధమైన డిమాండ్ను లేవనెత్తినందుకు ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. గతంలో ఎన్నడూ ఇంత మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయలేదు. డిసెంబర్ 13న జరిగిన ఘటన క్షమించరానిది. దీన్ని ఎవరూ సమర్థించలేరు. దీనిపై స్పందించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నాలుగు రోజుల సమయం పట్టింది. అది కూడా సభలో కాకుండా పార్లమెంటు బయట స్పందించారు. దేశ ప్రజల పట్ల ఆయన నిర్లక్ష్యపూరిత వైఖరికి ఇది నిదర్శనం’ అంటూ సోనియా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
జమ్ముకశ్మీర్ బిల్లులపై చర్చ సందర్భంగా దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వంటి దేశ భక్తులను కించపరిచేలా కొందరు చరిత్రను వక్రీకరించారని సోనియా మండిపడ్డారు. చారిత్రక వాస్తవాలను కప్పిపెడుతూ నిరంతర దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఈ ప్రచారానికి నేతృత్వం వహిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. అయితే, ఇలాంటి చర్యలకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. నిజాలను ప్రజల ముందు ఉంచడానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను తక్షణం పునరుద్ధరించి, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Also Read..
Coronavirus | కొత్తగా 341 కరోనా కేసులు.. మూడు మరణాలు.. అత్యధికంగా కేరళలోనే
Heavy Rains | 47 ఏళ్లలో లేనివిధంగా కుండపోత వర్షంతో అతలాకుతలమైన తమిళనాడు.. 10 మంది మృతి
Coronavirus | కొవిడ్పై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు సూచన