న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, మణిపూర్, గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అత్యంత కీలకపాత్ర పోషించగల ఒక ప్రత్యేక ఓటర్ల సమూహంపై తమ దృష్టిని సారిస్తున్నాయి. అదే జెన్ జీ. రెండు కీలక పరిణామాలు ఈ మార్పునకు కారణమయ్యాయి. మొదటిది, జూలైలో ఢిల్లీలో జెన్ జీ నేతృత్వంలో జరిగిన ఉద్యమం యువ ఓటర్ల చుట్టూ ఉన్న రాజకీయ చర్చను మార్చివేసింది. రెండోది, బీహార్లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా ఉపఎన్నికల ఊహించని ఫలితాలు, యువ ఓటర్ల ప్రభావాన్ని తిరిగి సమీక్షించుకునేలా రాజకీయ పార్టీలను ప్రేరేపించాయి. మహిళలు, వెనుకబడిన వర్గాలు, రైతులు, దళితులు ఎలాగైతే ప్రత్యేక ఓటు బ్యాంకులుగా ఆవిర్భవించారో అలాగే జెన్ జీ కూడా ఒక కొత్త రాజకీయ వర్గంగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు భావిస్తున్నారు.
ఎన్నికలు జరుగనున్న ఏడు రాష్ర్టాల్లో 18 నుంచి 29 ఏండ్ల వయస్సున్న జెన్ జీ ఓటర్లు దాదాపు 22% వరకు ఉంటారని అంచనా. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు రాష్ర్టాల్లో మొత్తం 940 సీట్లు ఉండగా అందులో 257 సీట్లు 5% లేదా అంతకంటే తక్కువ మార్జిన్తో పార్టీలు గెలుపొందాయి. దీని అర్థం, ఈ 22% జెన్ జీ ఓటర్లలో కేవలం 5% మంది ఏకమై ఒకే పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తే, అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల సమీకరణాలను మార్చేంతటి గణనీయమైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని అత్యధిక స్థానాల్లో గెలుపు మార్జిన్ చాలా స్వల్పంగా ఉన్నది. ఆ రాష్ట్రంలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 131 స్థానాల్లో విజయం 5% కంటే తక్కువ మార్జిన్తో తేలింది. గుజరాత్లో 182 సీట్లకు 27, పంజాబ్లో 117 సీట్లకు 24, ఉత్తరాఖండ్లో 70 సీట్లకు 15, హిమాచల్ప్రదేశ్లో 68 సీట్లకు 14 స్థానాల్లో ఇదే తరహా స్వల్ప మార్జిన్ నమోదైంది. స్వల్ప ఓట్ల మార్పుతో ఫలితాలు మారే అవకాశం ఉన్న స్థానాలు అధికంగా ఉండటంతో రాజకీయ పార్టీలు జెన్ జీ చుట్టూ తమ వ్యూహాలను రచించడం ప్రారంభించాయి.
అమలు చేయగల హామీలు ఇవ్వాల్సిందేనా!
కుల, మత సమీకరణాలను యువతరం తలకిందులు చేయగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు యువతకు సంబంధించిన అంశాలు ఎక్కువగా పార్టీల మ్యానిఫెస్టోలకే పరిమితమయ్యాయి. ఇకముందు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి నేరుగా ప్రచార ప్రసంగాలు, రాజకీయ సందేశాల్లో భాగమవుతాయి. ప్రస్తుత జెన్ జీ ధోరణి ఇలాగే కొనసాగితే సంప్రదాయ కుల, మత సమీకరణాలు దెబ్బతినవచ్చు. మహిళా ఓటర్లు సంప్రదాయ కుల సమీకరణాలు అధిగమించి ఎన్డీయేకు మద్దతు ఇచ్చినట్టే జెన్ జీ కూడా ఏదైనా ఒక రాజకీయ కూటమి వైపు మొగ్గు చూపగల శక్తివంతమైన ఓటు బ్యాంకుగా మారవచ్చు.
ఉచిత పథకాలు, స్వల్పకాలిక లబ్ధిపై యువ ఓటర్లు తక్కువ ఆసక్తి చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలు విస్తృతస్థాయి ప్రజాకర్షక హామీల కంటే ఆచరణాత్మకమైన, అమలు చేయగల వాగ్దానాల వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది. జెన్ జీని ఆకట్టుకునేందుకు ఇప్పటికే రాజకీయ పార్టీలు సన్నాహాలు మొదలుపెట్టాయి. ప్రధాని మోదీ, బీజేపీ ఇతర నేతలు యువతకు చేరువయ్యేందుకు ఇన్స్టాగ్రామ్, ఇతర డిజిటల్ వేదికలపై దృష్టి సారించారు. కాంగ్రెస్ కూడా యువ నిరసనకారులతో తన అనుసంధానాన్ని పెంచుతున్నది. సమాజ్వాదీ పార్టీ తన జెన్ జీ సంప్రదింపుల బాధ్యతను ఎంపీ డింపుల్ యాదవ్కు అప్పగించింది.