న్యూఢిల్లీ: గత నెల 20న జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై పోలీసుల అమానుష చర్యపై పార్లమెంట్లో ప్రకటన చేయాలని విపక్షాలు హోం మంత్రి అమిత్ షాను డిమాండ్ చేస్తున్నాయి. అయితే గత రెండు వారాలుగా ఆయన ఏ సభలోనూ కన్పించకపోవడం ఒక రికార్డుగా మారింది. ఆయన అదృశ్యమయ్యారంటూ పోస్టర్లు వేసినా, నినాదాలు చేసినా అవేమీ ఆయనను సభకు రప్పించలేక పోయాయి. ఓ సభ్యుడు ఫలానా రోజు సభకు హాజరు కావాలని విపక్షాలు డిమాండ్ చేయలేవని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సభ్యులు సభలో లొల్లి చేయడానికే పరిమితం కాగా, హోం మంత్రి తన కార్యాలయంలో అర్ధరాత్రి వరకు ఉండి పనిచేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఏదో ఒకరోజు హాజరు?
అమిత్ షా సోమవారం సభకు హాజరవుతారన్న ప్రచారం జరుగుతున్నది. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13న గురువారం సభ ముగియనున్నందున ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. మొత్తం వర్షాకాల సమావేశాలకు గైర్హాజరయ్యారన్న అపఖ్యాతిని నివారించడానికి ఆయన వచ్చే వారం ఏదో ఒక సభకు హాజరవుతారని భావిస్తున్నారు. డీఎంకే, మరికొన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతును పొందగలిగితే హోంమంత్రి ఎఫ్సీఆర్ఏ బిల్లు, సవరించిన డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టవచ్చుననే అంచనాలు పెరుగుతున్నాయి.