Heavy Rains | గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)తో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. పది రోజుల కిందట మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో గత మూడు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలకు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు, నిత్యవసర సరకులు అందిస్తున్నారు.
10 మంది మృతి
దక్షిణాది జిల్లాలు, ప్రత్యేకించి తిరునల్వేలి, టుటికోరిన్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా తెలిపారు. 24 గంటల్లో తిరునెల్వేలిలో సుమారు 670 మిల్లీమీటర్లు, టుటికోరిన్లో 932 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ఆ రెండు జిల్లాలకు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. గోడ కూలి కొందరు, విద్యుదాఘాతంతో కొందరు మరణించినట్లు ఆయన వెల్లడించారు.
పాఠశాలలు, కళాశాలలు బంద్..
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. తిరునల్వేలి, తెన్కాసి, తూత్తుకుడి జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు బుధవారం కూడా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్కోయిల్-కన్యాకుమారి, నాగర్కోయిల్-తిరునెల్వేలి స్సెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
వరదల్లో చిక్కుకున్న 20,000 మంది..
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తామరబరాణి నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో 1.2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు వర్షం కారణంగా సంభవించిన వరదల్లో సుమారు 20,000 మంది ప్రజలు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, సైన్యం రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
47 ఏళ్లలో లేనివిధంగా కుండపోత..
ఇక చెన్నై దాని పరిసర ప్రాంతాలు మిచౌంగ్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే భారీ వర్షం కురవడంతో చెన్నై నగరం మరోసారి మునిగింది. గత 47 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ వర్షాలు రాష్ట్రంలో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. దీంతో తక్షణ సహాయం కోసం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Mr Stalin) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్కాసి జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు సీఎం తెలిపారు. తక్షణ సహాయం, మౌలిక సదుపాయాల మరమ్మత్తుల కోసం జాతీయ విపత్తు సహాయ నిధి నుండి రూ. 2,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రాన్ని అభ్యర్థించారు.
Also Read..
Droupadi Murmu | నేడు పోచంపల్లికి రాష్ట్రపతి ముర్ము.. చేనేత వృత్తి, కార్మికుల స్థితిగతులపై ఆరా
Sreeleela | ఇక నుంచి డాక్టర్ శ్రీలీల.. బిజీ షెడ్యూల్లోనూ ఎంబీబీఎస్ పరీక్షలు కంప్లీట్!
Tamraparni River: తిరునెల్వెలిలో ఉప్పొంగుతున్న తామ్రపార్ని నది.. వీడియోలు