Droupadi Murmu | యాదాద్రి భువనగిరి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆమె బుధవారం పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లి టై అండ్ డై, ఇక్కత్ చీరెలను తయారీని పరిశీలించనున్నారు. వివిధ అవార్డు గ్రహీతలు, నేత కార్మికులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వారం రోజులుగా ఏర్పాట్లలో తలమునకలైన కలెక్టర్ హన్మంతు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోచంపల్లి పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ప్రతి సంవత్సరం రాష్ట్రపతికి హైదరాబాద్లో శీతాకాలపు విడిది ఉంటుంది. ఈ ఏడాది కూడా రాష్ట్రపతి ముర్ము ఈ నెల 18న హైదరాబాద్ చేరుకున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని భూదాన్ పోచంపల్లిని ఆమె సందర్శించనున్నారు. ఉదయం 11.10 నుంచి మధ్యాహ్నం 12.10గంటల మధ్య రాష్ట్రపతి పర్యటన కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. సుమారు గంట పాటు పట్టణంలో గడుపనున్నారు. బుధవారం బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రపతి పోచంపల్లికి చేరుకుంటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భారీ కాన్వాయ్తో పట్టణంలోని టూరిజం సెంటర్, ఆచార్య వినోబాబావే భవనానికి వెళ్తారు. భూదాన ఉద్యమకారులైన వినోబాబావే, వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు నివాళులర్పిస్తారు. అనంతరం వినోబాబావే భవనంలో ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు.
ఎంపిక చేసిన వారికే అనుమతి..
ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన శ్రీరంజన్ సిల్క్ సెంటర్ను రాష్ట్రపతి సందర్శిస్తారు. ఇందులోనే దారం తయారీ నుంచి వస్త్రం తయారీ ప్రక్రియ ఉంటుంది. పట్టుగూళ్ల నుంచి పట్టు తీయడం, ఆసు పోయడం, రంగులు అద్దడం, చిటికి తిప్పడం, చీరెలు నేయడం తదితర వాటిని అడిగి తెలుసుకుంటారు. చివరగా బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుంటారు. ఫంక్షన్ హాల్లో సుమారు 400మందికే అనుమతిచ్చారు. కేవలం పాస్లు ఉన్నవారినే లోపలికి పంపించనున్నారు. వేదికపై రాష్ట్రపతి ముర్ముతోపాటు గవర్నర్ తమిళిసై, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు అధికారులు ఉంటారు. రాష్ట్రపతి ఇక్కడే చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. పద్మశ్రీ, సంత్కబీర్, జాతీయ అవార్డు గ్రహీతలతో మాట్లాడతారు. అంతేకాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 16మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించగా, అందులో ఎంపిక చేసిన ఐదు నుంచి పది మంది రాష్ట్రపతితో ముచ్చటిస్తారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత వారం, పది రోజులుగా అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. సభాస్థలి, మగ్గాల ప్రదర్శన, వీఐవీల రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్ చుట్టూ షామియానాలతోపాటు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వినోబాబావే, రామచంద్రారెడ్డి విగ్రహాలను రంగులతో అలంకరించారు. రాష్ట్రపతి రాక కోసం మూడు ఆర్మీ చాపర్లను వినియోగించనున్నారు. ఇందుకోసం పోలీస్ స్టేషన్ పక్కనే హెలిప్యాడ్ సిద్ధం చేశారు. సోమవారం స్పెషల్ చాపర్ ట్రయల్ రన్ కూడా నిర్వహించింది.
చేనేత స్టాళ్ల ఏర్పాటు
ఫంక్షన్ హాల్ వద్ద తెలంగాణ చేనేత ఔన్నత్యం ప్రతిబింబించేలా థీమ్ పెవిలియన్ ఏర్పాటు చేయనున్నారు. ఫంక్షన్ హాల్లో చేనేతకు సంబంధించిన వివిధ స్టాళ్లు ఏర్పాటు చేశారు. పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తేలియా రుమాళ్లు, ముచ్చపేట, నారాయణపేట, గద్వాల చీరెలు, సిద్దిపేట గొల్లబామ చీరెలతో స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడే చేనేత మగ్గం నేసే విధానం, చీరెల తయారీతోపాటు చరఖాను ప్రదర్శించనున్నారు.
పకడ్బందీ బందోబస్తులో పోచంపల్లి..
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలు పోచంపల్లిలో పటిష్ట బందోబస్తు నిర్వహించాయి. అడుగడుగునా పోలీస్ నిఘా ఉంచాయి. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. హెలిప్యాడ్ వద్ద బాంబ్ స్వాడ్, డాగ్ స్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ప్రత్యేక పోలీస్బలగాలు వేదిక వద్ద అనువణువు పరిశీలించాయి. మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశాయి. ఇప్పటికే సీపీ సుధీర్బాబు, డీసీపీ రాజేశ్ చంద్ర ఏర్పాట్లను పరిశీలించారు. ఇక ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.