రాంచి: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్ఎసీ) నిర్వహించిన నియామక పరీక్షల్లో లీకులు, అవకతవకలపై యువత నిరసనలు 17వ రోజుకు చేరుకున్నాయి. విద్యార్థుల నిరసనలకు దేశ వ్యాప్తంగా మద్దతు రావడంతో పాటు ఆరుగురు అభ్యర్థులు నిరాహార దీక్షకు దిగడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఆదివారం ప్రభుత్వం విద్యార్థుల మధ్య జరిగిన చర్చలు మరోసారి విఫలం అయ్యాయి. 14వ జేపీఎస్సీ నియామక పరీక్షను రద్దు చేస్తామని, పరీక్ష నిర్వహించిన టీడీపీఎల్ సంస్థపై ఈడీ విచారణకు ఆదేశిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా విద్యార్థులు వెనక్కు తగ్గలేదు. సీజీఎల్ పరీక్షను కూడా రద్దు చేయాలని, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని విద్యార్థులు పట్టబట్టారు. కానీ వాటికి ప్రభుత్వం విముఖత చూపడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో జేపీఎస్సీకి చెందిన ముగ్గురు సభ్యులు డాక్టర్ అజిత భట్టాచార్య, డాక్టర్ అనిమా హన్స్దా, డాక్టర్ జమాల్ అహ్మద్ తమ పదవులకు రాజీనామా చేశారు.
తమ రాజీనామా పత్రాలను గవర్నర్కు అందజేశారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించేవరకు తమ నిరసనలు కొనసాగుతాయన్నారు. ఈ మేరకు సోమవారం జార్ఖండ్ అసెంబ్లీకి మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. సీజీఎల్ పరీక్ష సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం నిర్వహించామని.. అది న్యాయ పరిధిలో ఉన్నందున రద్దు చేయడం కుదరదని మంత్రి సుదివ్య కుమార్ సోను తెలిపారు. పైగా పరీక్ష ఇప్పటికే పూర్తయి ఫలితాలు వచ్చేశాయని, అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పరీక్ష రద్దు కోరడం చిక్కుముడి లాంటిదన్నారు. సీఎం హేమంత్ సోరెన్ ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. యువతకు అన్ని విధాలుగా పారదర్శకంగా న్యాయం చేస్తామన్నారు.
ఐసీయూ నుంచే నిరాహార దీక్ష..
పరీక్షల అవకతవకలపై నిరాహార దీక్ష చేస్తున్న ఆరుగురిలో రాహుల్ క్రాంతి సదర్ దవాఖాన ఐసీయూ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.