న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత ఆదివారం అత్యాచారం, హత్యకు ( Molest and Murder ) గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్గాంధీ పరామర్శించారు. ఉదయాన్నే బాధితురాలి ఇంటి వెళ్లిన రాహుల్గాంధీ.. ఆమె కుటుంబసభ్యులు కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కేసు విషయంలో న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధితురాలు కేవలం ఆ కుటుంబానికి మాత్రమే ఆడబిడ్డ కాదని, ఈ దేశానికి చెందిన ఆడబిడ్డ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్గాంధీ.. బాధితురాలు కుటుంబంతో మాట్లాడాను. వారు ఈ కేసులో న్యాయం జరుగాలని కోరుకుంటున్నారు. అంతకుమించి వారు ఇంకేం ఆశించడం లేదు. వారికి సాయం కావాలి. మేం ఆ సాయం చేస్తాం. ఆ కుటుంబానికి అండగా నిలబడుతాం. న్యాయం జరిగే వరకు రాహుల్గాంధీ ఆ కుటుంబానికి అండగా ఉంటాడు అని ఆయన హామీ ఇచ్చారు.
కాగా, గత ఆదివారం ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియాలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తొమ్మిదేండ్ల వయసున్న దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆ బాలికను హత్యచేసి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. ఈ విషయం బయటికి పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.