MK Stalin | బిల్లుల ఆమోదంపై గవర్నర్ (Tamil Nadu Governor) ఆర్.ఎన్. రవి (RN Ravi), తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ విభేదాల వేళ.. ఎంకే స్టాలిన్ (MK Stalin) ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు స్వయంప్రతిపత్తి (Tamil Nadu autonomy)పై సూచనలకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. స్వయంప్రతిపత్తి కోసం తీసుకోవాల్సిన చర్యలను ఆ కమిటీ సిఫారసు చేయనుంది. ఈ మేరకు సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు.
ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎం. నాగనాథన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రాష్ట్ర స్వయంప్రతిపత్తిని నిర్ధరిస్తుంది. సిఫార్సులతో కూడిన తుది నివేదికను ఈ కమిటీ రెండేళ్లలో ప్రభుత్వానికి సమర్పించనుంది.
తమిళనాడు ప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించలేదు. అలాగే అసెంబ్లీ తిరిగి ఆమోదించిన ఈ బిల్లులను తప్పుగా రాష్ట్రపతికి పంపడం న్యాయపరమైన సవాలుకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపిన గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తిరిగి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టాలు (రెండవ సవరణ) 2022, తమిళనాడు ఫిషరీస్ యూనివర్శిటీ (సవరణ) చట్టం 2020 (గతంలో తమిళనాడు డాక్టర్ జే జయలలిత ఫిషరీస్ యూనివర్సిటీగా ఉన్న పేరు మార్పు), ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారాన్ని గవర్నర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు వంటి చట్టాలను గవర్నర్, రాష్ట్రపతి అనుమతి లేకుండానే ప్రభుత్వ గెజిట్లో నోటిఫై చేసింది. ఏప్రిల్ 11న ఆ రాష్ట్ర గెజిట్లో పది చట్టాలను అధికారికంగా నోటిఫై చేసింది. ఒక రాష్ట్రం ఇలా చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
కాగా, భారత రాజ్యాంగం ప్రకారం సాధారణంగా ఒక బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత గవర్నర్కు పంపుతారు. గవర్నర్ ఆమోదిస్తే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. అలాగే గవర్నర్ తన సమ్మతిని నిలిపివేయవచ్చు. పునఃపరిశీలన కోసం బిల్లును ప్రభుత్వానికి తిరిగి పంపవచ్చు. లేదా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు. అయితే తిరిగి వచ్చిన బిల్లును మార్పులతో లేదా మార్పులు లేకుండా మళ్లీ శాసనసభ ఆమోదించినట్లయితే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాలి. దానిని మళ్లీ రిజర్వ్ చేయలేరు. హైకోర్టు లేదా కేంద్రం పరిధిలోని అంశాలను ప్రభావితం చేసే బిల్లు మాత్రం తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లాలి.
Also Read..
“Supreme court | తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రపతికీ సందేశమే..!”