Cyclone Biparjoy | గుజరాత్ (Gujarat) రాష్ట్రాన్ని ఓ వైపు బిపర్ జాయ్ తుపాను వణికిస్తుండగా.. మరోవైపు అక్కడ తాజాగా భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కచ్ (Kutch) జిల్లాలో బుధవారం సాయంత్రం 3.5 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. కచ్ జిల్లాలోని భచౌకు 5 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలిపారు.
మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జాయ్ తుపాను (Cyclone Biparjoy) తీరం వైపు దూసుకొస్తోంది. సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పాకిస్థాన్ తీరం సమీపంలోని కచ్లో ఉన్న జఖౌ పోర్టు (Jakhau port) వద్ద అది కేంద్రీకృతమవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం గుజరాత్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో బిపర్జాయ్ తుపాను పయణిస్తున్నదని తెలిపింది. దీంతో గుజరాత్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. తుపాను ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాను భారీ విధ్వంసం సృష్టించనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 70 గ్రామాలకు చెందిన 75 వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. త్రివిధ దళాలు సహా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
Also Read..
Manipur violence | మణిపూర్లో హింస.. మహిళా మంత్రి నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు
EPFO | అధిక పెన్షన్కు కావాల్సిన పత్రాలివే.. దరఖాస్తు ప్రక్రియను సరళతరం చేసిన ఈపీఎఫ్ఓ
Gujarat | గుజరాత్లో ప్రారంభించక ముందే కూలిన కొత్త వంతెన