Gujarat | తాపి : ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మోర్బీ వంతెన తరహా దుర్ఘటన మరొకటి జరిగింది. తాపి జిల్లాలో మిండోహ్లా నదిపై ప్రభుత్వం కొత్తగా నిర్మించిన వంతెన ప్రారంభానికి ముందే బుధవారం కుప్ప కూలింది. ఈ దుర్ఘటన సుమారు 15 గ్రామాలపై ప్రభావం చూపింది. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. రూ.2 కోట్ల వ్యయంతో 2021లో ఈ బ్రిడ్జి పనులను ప్రారంభించారు.
వంతెన నిర్మాణంలో అవినీతి చోటు చేసుకోవడం వల్లే బ్రిడ్జి కూలిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సామగ్రి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. కార్యనిర్వాహక ఇంజినీర్ నీరవ్ రాథోడ్ ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిపుణులతో చర్చించి ఘటనకు గల కారణాలను తెలుసుకుంటామని తెలిపారు.