న్యూఢిల్లీ: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయిన రామ్నాథ్ కోవింద్పై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. బీజేపీ రాజకీయ ఎజెండాను ఆయన నెరవేర్చారని విమర్శించారు. ‘పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి, వారసత్వాన్ని వదిలివేశారు. భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. రాజ్యాంగాన్ని పణంగా పెట్టి ఆర్టికల్ 370, సీఏఏ రద్దు, మైనారిటీలు, దళితుల అణచివేత వంటి బీజేపీ రాజకీయ ఎజెండాను నెరవేర్చారు’ అని మెహబూబా విమర్శించారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు.
కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అంతేగాక ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వివాదస్పదమైంది. 2019లో దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రం తెచ్చిన ఈ బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ పదవి నుంచి దిగిన వేళ, బీజేపీ ఎజెండాను పూర్తి చేశారంటూ ముఫ్తీ విమర్శించారు.
The outgoing President leaves behind a legacy where the Indian Constitution was trampled upon umpteenth times. Be it scrapping of Article 370,CAA or the unabashed targeting of minorities & Dalits, he fulfilled BJPs political agenda all at the cost of the Indian Constitution.
— Mehbooba Mufti (@MehboobaMufti) July 25, 2022