రాయపోల్, ఏప్రిల్ 11 :కొత్తగా ఏర్పడ్డ రాయపోల్ మండల కేంద్రం పల్లెప్రగతితో అభివృద్ధివైపు పరుగులు తీస్తున్నది. 3192 జనాభా ఉన్న ఈ గ్రామంలో, 1036 ఇండ్లు ఉన్నాయి. 2900 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో రూ.4లక్షలతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం ఆకట్టుకుంటున్నది. పార్కు చుట్టూ ఫెన్సింగ్, వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేశారు. వాటికి వివిధ రకాల కలర్ పేయింటింగ్ వేయించారు. ప్రధాన గేట్ను ఏర్పాటు చేయడంతో చూడముచ్చటగా కనిపిస్తున్నది. గ్రామంలో 250 విద్యుత్ స్తంభాలు బిగించి వాటికి ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయడంతో రాత్రిపూట జిగేలుమంటున్నది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా జీపీ పారిశుధ్య సిబ్బంది ఇంటింటా తిరుగుతూ చెత్త సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. దీంతో గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడింది. ప్రతిరోజు ట్యాంకర్తో పారిశధ్య కార్మికులు మొక్కలకు నీరు పడుతున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలో 1036 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. 40వేల లీటర్ల వాటర్ ట్యాంక్లను నిర్మించడంతో తాగునీటి సమస్యలు దూరమయ్యాయి. గ్రామంలో రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డు నిర్మించారు. రాయపోల్ మండల కేంద్రం నుంచి ఉదయపూర్, కొత్తపల్లి రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలతో పచ్చదనం పరుచుకున్నది. రూ.70లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు. రూ.22లక్షలతో రైతువేదికను అందంగా నిర్మించారు.
రూ.4లక్షలతో కబురు చెప్పే మైక్ సౌండ్..
ఒకప్పడు గ్రామస్తులకు ఎలాంటి సమాచారం తెలియజేయాలన్నా డప్పు చాటింపు వేయించేవారు. సాంకేతిక విప్లవం కొత్తపుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ.4లక్షలను ఖర్చు చేసి గ్రామంలోని ప్రధాన చౌరస్తాల వద్ద మైక్లు ఏర్పాటు చేశారు. ఏ చిన్న విషయమైనా తొందరగా ఈ మైకుల ద్వారా అనౌన్స్ చేసి గ్రామస్తులకు తెలియజేస్తున్నారు.