Shimla | ఉత్తర భారతంలో కొండప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh )ను భారీ వర్షాలు (Heavy Rains) అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు నదులు ఉప్పొంగి ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలను వరదలు పోటెత్తాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా (Shimla)లో మరోసారి భారీగా కొండచరియలు ( Landslide) విరిగిపడ్డాయి. సోమవారం నాడు సిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతం (Summer Hill Area)లో శివ్ మందిర్పై కొండచరియలు విరిగిపడి సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మరోసారి అక్కడ భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
కాగా, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా నాలుగు రోజుల వ్యవధిలోనే సుమారు 60 మంది
ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు (Sukhvinder Singh Sukhu)
తెలిపారు. గత మూడు రోజుల్లో సాధారణ వర్షపాతం కన్నా 157 శాతం అధికంగా వర్షాలు కురిసినట్లు
చెప్పారు. మరోవైపు ఖాంగ్రాలోని పోంగ్ డ్యామ్ (Pong Dam) వద్ద లోతట్టు ప్రాంతాల్లోని 800 మంది
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం వెల్లడించారు.
ఇక రాబోయే రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ
(IMD) అంచనా వేసింది. ఈ మేరకు ఆగస్టు 19వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు భారీ
వర్షాల నేపథ్యంలో నేడు కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
Also Read..
Rishi Sunak | ప్రధానిగా కాదు.. హిందువుగా వచ్చా .. రామ కథ కార్యక్రమంలో రిషి సునాక్
Game Changer | బాపూజీ ముందు వర్కింగ్ మూడ్లో శంకర్.. ఇండిపెండెన్స్ డే విషెస్