మదనాపురం, ఆగస్టు 9 : మొసలి నోట్లో చిక్కితే మృత్యువు తప్పదని మన పూర్వికులు చెబుతుంటారు. కాని అది తప్పని రుజువు చేశాడు ఒక మత్స్యకారుడు. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని గోపన్పేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు మహేశ్ రోజు మాదిరిగా రామన్పాడు జలాశయంలో ఆదివారం చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడతుండగా ఒక్కసారిగా మొసలి అతనిపై దాడి చేసింది. కుడికాలి పాదాన్ని నోటితో గట్టిగా పట్టుకోగా మహేశ్ భయపడకుండా తన ఎడమకాలితో బలంగా మొసలిని తన్నాడు. అది మహేశ్ కుడి కాలిని విడిచిపెట్టి తన తోకతో ఎడమకాలిపై దాడి చేసింది.
మహేశ్ తప్పించుకొని తోటి మత్స్యకారుల సాయంతో ఆత్మకూరు ప్రభుత్వ దవాఖానకు చేరుకున్నాడు. ప్రథమ చికిత్స అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మహేశ్ కాలికి 7కుట్లు పడ్డాయని తోటి మత్స్యకారులు తెలిపారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల వెంకటస్వామి మాట్లాడుతూ మత్స్యకారులకు ఇన్సూరెన్స్, బీమా సభ్యత్వాలు, సబ్సిడీపై వలలు, తెప్పలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. థర్మకోల్ సీట్తో చేపల వేటకు వెళ్త్తుండడం తో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని దీనిని అరికట్టి మత్స్యకారులకు భద్రత కల్పించాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు.