హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ఈగల్ స్టేట్ టాస్ఫోర్స్, అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన నరేంద్ర శ్రీనివాస్ అనే డ్రగ్ పెడ్లర్ను అరెస్టుచేశారు. అతని నుంచి 330 గ్రాముల హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.2.5 లక్షలు ఉంటుందని ఈగల్ పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పరిధి గుర్రంగూడలో నివాసం ఉంటున్న నరేంద్ర శ్రీనివాస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసైన అతను, గతంలో డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
జైలు నుంచి బెయిల్పై విడుదలైన అనంతరం కొంతకాలం డ్రైవర్గా పనిచేసిన నరేంద్ర శ్రీనివాస్.. తన ఖర్చులకు ఆదాయం సరిపోకపోవడంతో డ్రగ్స్ విక్రయాల వైపు మళ్లినట్టు ఈగల్ ఫోర్స్ తెలిపింది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పడువాకు చెందిన హరి అనే డ్రగ్ సరఫరాదారుతో స్నాప్చాట్ ద్వారా పరిచయం పెంచుకొని హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో విక్రయించేవాడు. ఈ కేసులో వినియోగదారులపై కూడా దృష్టిపెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.