Ram Temple | అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం రెండో రోజూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నుంచి రామ్లల్లా దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో బాలరాముడి దర్శనం కోసం వేచి ఉన్నారు. మంగళవారం సుమారు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 3 లక్షల మంది దర్శనం కోసం వేచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా బుధవారం కూడా ఆయలంలో రద్దీ నెలకొంది.
ఉదయం నుంచే వేల సంఖ్యలో భక్తులు రాముడి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి. ప్రతి రోజూ సుమారు లక్ష మంది శ్రీరాముడిని దర్శించుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో రద్దీని అదుపు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లను ఏర్పాటు చేసి స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), ఎస్ఎస్బీ సహా దాదాపు 8,000 మంది భద్రతా సిబ్బంది ఆలయం వద్ద మోహరించినట్లు అయోధ్య ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు. భక్తులు బాలరాముడి దర్శనం కోసం తొందరపడాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు రెండు వారాల తర్వాత తమ ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Also Read..
Ram Temple | అయోధ్య రాముడిని దర్శించుకున్న వానరం.. హనుమంతుడే వచ్చాడంటూ ట్రస్ట్ ట్వీట్
Ram Mandir | రామ మందిరానికి భారీ విరాళం అందించిన అంబానీ కుటుంబం..?
Heart Attack | జై శ్రీరామ్ అని నినదిస్తూ గుండెపోటుతో మృతిచెందిన హనుమ వేషధారి..!