చండ్రుగొండ, ఆగస్టు 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సహకార సంఘం కార్యాలయంలో సోమవారం యూరియా విక్రయాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సొసైటీ సిబ్బంది రవాణా చార్జీలను అదనంగా వసూలు చేయడం పట్ల రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం రైతులపై చార్జీల భారం మోపలేదని రైతులు తెలుపుతున్నారు. ప్రస్తుతం యురియా బస్తా రూ.257 విక్రయించాల్సి ఉండగా రూ.315 కు విక్రయిస్తున్నారు. ఇందులో అదనంగా రూ.35 రవాణా చార్జీ కోసమే అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే రవాణా చార్జీలు వసూలు చేస్తున్నామని సొసైటీ సిబ్బంది చెబుతున్నారు. ఒకవైపు కరువుతో అల్లాడుతుంటే, వర్షాలు లేక వర్షం కోసే ఎదురుచూస్తున్న అన్నదాతలకు యూరియా రవాణా చార్జీల పేరుతో అదనపు భారం మోపడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులపై అదనంగా మోపిన రవాణా చార్జీల భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రైతులపై రవాణా భారం

రైతులపై రవాణా భారం