Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur Violence)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మణిపూర్లో ఈ ఏడాది జూలైలో ఆచూకీ లేకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్లు ఫొటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సాయుధ మూకల చేతిలో వారు హత్యకు గురైనట్లు తేలింది. వారి మృతదేహాల ఫొటోలు ఇంటర్నెట్పై ఆంక్షలు ఎత్తివేయడంతో వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రాష్ట్రంలోని విద్యార్థులు ఘటనకు నిరసనగా మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాజధాని ఇంపాల్ (Imphal)లో వందలాది మంది విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.
బుధవారం కూడా వారు తమ నిరసనలను కొనసాగించారు. ఇంపాల్ వీధుల్లో విద్యార్థుల మృతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు నిరసన కారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిపై లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 50 మందికిపైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం మళ్లీ మెబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది. అక్టోబర్ 1 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Also Read..
Mahindra | ఆ కారులో అందుకే ఎయిర్బ్యాగ్స్ ఓపెన్ కాలేదు.. యూపీ ఘటనపై స్పందించిన మహీంద్రా సంస్థ
Elon Musk | కొవిడ్ బూస్టర్ డోస్ నన్ను ఆసుపత్రిపాలు చేసింది : ఎలాన్ మస్క్
Jairam Ramesh | మణిపూర్లో పర్యటించేందుకు మోదీకి సమయం దొరకడం లేదు : జైరాం రమేశ్