Mahindra | దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra And Mahindra) చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సహా సంస్థలో పనిచేస్తున్న మరో 12 మంది ఉద్యోగులపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో (Scorpio) వాహనంలో ఎయిర్బ్యాగ్స్ (Airbags) ఓపెన్ కాకపోవడంతో తన కుమారుడు మృతి చెందాడంటూ యూపీకి చెందిన రాకేశ్ మిశ్రా అనే వ్యక్తి కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహీంద్రా సహా 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, ఈ అంశంపై తాజాగా సంస్థ స్పందించింది. తమ సంస్థ తయారు చేసిన వాహనాల్లోని ఎయిర్బ్యాగ్స్ పనితీరులో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజా ఘటనలో ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోకపోవడానికి గల కారణాలను వివరించింది.
అపూర్వ్ ఎస్యూవీలో ప్రయాణిస్తున్న సమయంలో సీటు బెల్టు పెట్టుకున్నప్పటికీ ప్రమాద సమయంలో కారు పల్టీలు కొట్టిన కారణంగా ఎయిర్బ్యాగ్స్లు తెరుచుకోలేదని వెల్లడించింది. ఆ వాహనంలో ఎయిర్బ్యాగ్స్ లేవంటూ కొందరు ఆరోపిస్తున్నారని.. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత విషయంలో తమ సంస్థ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుందని వెల్లడించింది.
యూపీకి చెందిన రాకేశ్ మిశ్రా 2022లో మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో (Scorpio)ను తన కుమారుడు అపూర్వ్కు కొనిచ్చాడు. దాని విలువ అప్పుడు రూ. 17.39 లక్షలు. దీంతో 2022 జనవరి 14 వ తేదీన అపూర్వ్ తన స్నేహితులతో కలిసి కొత్తకారులో లక్నో నుంచి కాన్పూర్ బయలు దేరాడు. ఈ క్రమంలో మార్గం మధ్యలో కారు ప్రమాదానికి గురైంది. పొగమంచు కారణంగా డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అపూర్వ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ఘటన తర్వాత జనవరి 29వ తేదీన ఆ కారును మహీంద్రా సర్వీసింగ్ సెంటర్కు తీసుకువెళ్లి అందులో ఉన్న లోపాలను వారికి వివరించాడు. తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్బ్యాగ్స్ ఓపెన్ కాలేదని.. అసలు ఆ కారులో ఎయిర్ బ్యాగ్స్ లేవని ఆరోపించాడు. కంపెనీ నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మరణించాడంటూ వారిపై మండిపడ్డారు. ఈ మేరకు కంపెనీ తప్పుడు హామీలిచ్చి తనను మోసం చేసిందంటూ ఆనంద్ మహీంద్రా సహా ఆ సంస్థలో పనిచేస్తున్న మరో 12 మంది ఉద్యోగులపై రాజేశ్ మిశ్రా చీటింగ్ కేసు పెట్టాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Elon Musk | కొవిడ్ బూస్టర్ డోస్ నన్ను ఆసుపత్రిపాలు చేసింది : ఎలాన్ మస్క్
Jairam Ramesh | మణిపూర్లో పర్యటించేందుకు మోదీకి సమయం దొరకడం లేదు : జైరాం రమేశ్
Google | గూగుల్ 25వ వార్షికోత్సవం నేడు.. ప్రత్యేక డూడుల్