బెంగళూరు: మాజీ భార్యకు గిఫ్ట్ కొనేందుకు ఒక వ్యక్తి తన స్నేహితుడ్ని చంపాడు. అతడి వద్ద ఉన్న డబ్బు దోచుకున్నాడు. విడిపోయిన రెండో భార్యను ఒక లాడ్జిలో కలిశాడు. ఆమెకు టీవీ కొనడంతోపాటు రూ. 60,000 నగదు ఇచ్చాడు. (Man Kills Friend) ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీరూర్ ప్రాంతానికి చెందిన షఫీ, వృత్తిరీత్యా వెల్డర్ అయిన పుట్టరాజు స్నేహితులు.
కాగా, విడిపోయిన రెండో భార్యకు గిఫ్ట్, డబ్బు ఇచ్చేందుకు షఫీ కుట్రపన్నాడు. ఫిబ్రవరి 19న స్నేహితుడైన పుట్టరాజుకు అతడు ఫోన్ చేశాడు. ఫైనాన్స్ కంపెనీ నిర్వహించే బంగారు వేలంలో పాల్గొనేందుకు అతడ్ని ప్రలోభపెట్టాడు. దీంతో ఉదయం 11 గంటలకు పుట్టరాజు రూ. 2.5 లక్షల నగదు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. షఫీని అతడు కలిశాడు.
మరోవైపు పుట్టరాజును బైక్పై హొన్నవల్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి షఫీ తీసుకెళ్లాడు. అక్కడ కత్తితో దాడి చేసి ఫ్రెండ్ను హత్య చేశాడు. అతడి వద్ద ఉన్న రూ.2.5 లక్షల డబ్బు తీసుకుని పారిపోయాడు. అటవీ ప్రాంతంలో పడి ఉన్న మృతదేహాన్ని మరునాడు పాల వ్యక్తి చూశాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు.
కాగా, మృతుడ్ని పుట్టరాజుగా పోలీసులు గుర్తించారు. అతడి చివరి కదలికలను పరిశీలించగా షఫీ వద్దకు చేరుకున్నట్లు తెలిసింది. అయితే పుట్టరాజు హత్య తర్వాత అరసికెరెలోని ఒక లాడ్జిలో విడిపోయిన రెండవ భార్యను షఫీ కలుసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. దోచుకున్న డబ్బులో ఆమెకు రూ. 60,000 ఇవ్వడంతో పాటు కొత్త టీవీ కొనిచ్చాడని పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో షఫీని అరెస్ట్ చేశారు. నిందితుడు షఫీ, హతుడు పుట్టరాజు మధ్య ఏడేళ్లుగా స్నేహం ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
IRIS Lavan | ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడికి ముందు.. మరో ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం
Watch: సెలవు నిరాకరించిన అధికారి.. పరిస్థితి వివరించేందుకు ప్యాంటు విప్పిన రైల్వే ఉద్యోగి
Watch: హోలీ నాడు రంగులు చల్లిన బాలుడు.. మనవడిపై వేడినీరు పోసిన మహిళ