న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా సబ్మెరైన్ దాడి చేసి సముద్రంలో ముంచేసింది. అయితే దీనికి ముందు మరో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ లావన్ (IRIS Lavan)కు భారత్ ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం అది కొచ్చిలో సురక్షితంగా ఉన్నది. విశాఖపట్నంలో జరిగిన నేవీ విన్యాసాల్లో ఇరాన్కు చెందిన వార్ షిప్లు పాల్గొన్నాయి. ఆ తర్వాత రెండు యుద్ధ నౌకలు ఇరాన్కు బయలుదేరాయి.
కాగా, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఉమ్మడిగా ఇరాన్పై దాడులు చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఈ దాడిలో హతమయ్యారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ సమయంలో హిందూ మహా సముద్ర జలాల్లో ఉన్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ లావన్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో భారత్ సహాయాన్ని ఇరాన్ కోరింది. కొచ్చిలో డాకింగ్ కోసం అనుమతి అడిగింది. మార్చి 1న ఆమోదం లభించింది. దీంతో మార్చి 4న ఐరిస్ లావన్ కొచ్చిలో డాకింగ్ చేసింది. ఈ నౌకలోని 183 మంది సిబ్బంది ప్రస్తుతం కొచ్చిలోని నేవల్ బేస్లో వసతి పొందుతున్నట్లు భారత్ పేర్కొంది.
మరోవైపు ఇరాన్కు తిరిగి వెళ్తున్న మరో యుద్ధ నౌక ఐరిస్ దేనాను అమెరికా జలాంతర్గామి టార్గెట్ చేసింది. మార్చి 4న టార్పెడోతో దానిని పేల్చివేయడంతో హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. శ్రీలంక తీరం సమీపంలో ఈ సంఘటన జరుగడంతో ఆ దేశ నేవీ, ఎయిర్ఫోర్స్ అప్రమత్తమయ్యాయి. ఐరిస్ దేనాలోని సుమారు 130 మందిలో 80 మందికిపైగా సిబ్బంది మరణించగా 32 మందిని కాపాడారు. శ్రీలంకలోని ఆసుపత్రిలో వీరు చికిత్సపొందుతున్నారు.
అయితే భారత్కు అతిథిగా వచ్చిన తమ దేశ నౌక (ఐరిస్ దేనా)పై అమెరికా దారుణంగా దాడి చేసి ముంచేసిందని ఇరాన్ ఆరోపించింది. ఈ విమర్శల నేపథ్యంలో ఇండియన్ నేవీ స్పందించింది. ఐరిస్ దేనా నుంచి ప్రమాద సంకేతం అందిన తర్వాత తమ యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు అక్కడకు చేరుకున్నాయని తెలిపింది. శ్రీలంకతో కలిసి రెస్క్యూ, సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది.
Also Read:
Masoud Pezeshkian | పొరుగు దేశాలపై దాడులు.. క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు.. కానీ, ఒక షరతు
AN/TPY-2 Radar: కీలకమైన అమెరికా రేడార్ను పేల్చేసిన ఇరాన్
IDF: 80 జెట్స్.. 230 బాంబులతో.. ఇరాన్ అండర్గ్రౌండ్ మిస్సైల్ ఫ్యాక్టరీపై దాడి