బూర్గంపహాడ్, ఆగస్టు 17 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడగా ఉన్న సారపాక మేజర్ పంచాయతీలో ప్రధాన రహదారులు పశువులకు నిలయాలుగా మారాయి. పశువులకు సంబంధించిన యజమానులు వదిలివేయడంతో అవి ప్రధాన రహదారులపై చేరి తిష్ట వేస్తున్నాయని, రాత్రి సమయాల్లో వాహనదారులకు ప్రమాదాలు తప్పడంలేదని అటు వాహనదారులు, ప్రజలు మండిపడుతున్నారు. గోవుల సంచారాన్ని నియంత్రించాలని పంచాయతీలో జరిగిన గ్రామ సభల్లో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వాహనదారులు రాకపోకలు సాగించే ప్రధాన రహదారులపై పశువులు అడ్డదిడ్డంగా పడుకుని ఉండటంతో ప్రయాణం నరకంగా మారిందని, ఒక్కో సమయంలో |ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. పంచాయతీ సంబంధిత అధికారులు పశువులను రోడ్లపై వదిలే యజమానులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరిగాక చర్యలు తీసుకునే కంటే ముందుగానే స్పందిస్తే బాగుంటుందని ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన రహదారులపై పశువుల సంచారం.. పట్టించుకోని సారపాక పంచాయతీ