న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో(ayodhya Ram Temple) విరాళాలను చోరీ చేసిన కేసులో ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వీలైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని సిట్ను సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో ఏవైనా సూచనలను చేస్తే, వాటిని నిష్పక్షపాతంగా పరిశీలించాలని SITని సుప్రీంకోర్టు కోరింది. దర్యాప్తులో గుణాత్మక విశ్లేషణ కోసం మాత్రం చేసే సూచనలను సిట్ పరిగణలోకి తీసుకోవాలని కోర్టు చెప్పింది. రామాలయ విరాళాల చోరీ కేసులో దర్యాప్తునకు చెందిన స్టేటస్ నివేదిక ఇవ్వాలని సిట్ను సుప్రీం ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది.
విరాళాల చోరీ కేసులో దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి ఇవ్వాలని సుప్రీం కోరింది. దర్యాప్తులో గుణాత్మక మెరుగుదల, పారదర్శకత కోసం వివిధ వాజ్యందారులు చేసే సూచనలను సిట్ పరిగణలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొన్నది. అయితే సిట్ నివేదికను పరిశీలించిన తర్వాతే.. రామాలయ నిధుల మేనేజ్మెంట్ అంశంలో సరైన మార్గదర్శకాలు ఇవ్వడం జరుగుతుందని కోర్టు పేర్కొన్నది. అయోధ్య కేసులో ఐజీపీ కిరణ్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన సిట్ను జూలై 27వ తేదీన ఏర్పాటు చేశారు. దర్యాప్తు బృందంలో ఫోరెన్సిక్ ఆడిటర్ను కూడా జతకలపాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.