Masoud Pezeshkian : ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా దాడులకు దిగిన సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాలతోపాటు తుర్కియే, అజార్ బైజాన్ వంటి అనేక దేశాలపై ఇరాన్ మిస్సైల్ దాడులు చేసింది. అయితే, ఇలా పొరుగు దేశాలపై దాడులు చేసినందుకు ఇరాన్ తాజాగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పారు.
‘‘పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు చేసినందుకు క్షమాపణలు చెబుతున్నా. ఇకపై ఆ దేశాలపై దాడులు చేయకూడదని ఇరాన్ మధ్యంతర నాయకత్వం నిర్ణయించింది. ఇకపై పొరుగు దేశాలపై దాడులు చేయం. క్షిపణులు ప్రయోగించం. ఆ దేశాల నుంచి మా దేశంపైకి దాడులు జరగనంతవరకే మేం దాడులకు దిగకుండా ఉంటాం’’ అని పెజెష్కియన్ తెలిపారు. ఒకవేళ అమెరికా సైన్యం కొలువుదీరి ఉన్న ఆయా దేశాల నుంచి ఇరాన్పై దాడి జరిగితే మాత్రం తిరిగి దాడి చేస్తామని ఇరాన్ వెల్లడించింది. ఇరాన్కు సంబంధించిన ఒక టీవీ ఛానల్తో మసౌద్ ఈ ప్రకటన చేశారు. మరోవైపు ఇరాన్ ఏ దేశానికి లొంగిపోదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్తో ఎలాంటి చర్చలు, ఒప్పందాలు ఉండబోవని, బేషరతుగా లొంగిపోవాల్సిందే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ మాట్లాడుతూ, తమ దేశం ఎవరికీ లొంగిపోదన్నారు. ఇరాన్ లొంగిపోవాలనుకునే వారి కోరికను వారి సమాధులపైకి మళ్లిస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు ఇరాన్.. యూఏఈ, దుబాయ్, ఖతార్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అయితే, తాజా ప్రకటనతో ఇకపై దాడుల్ని ఆపేస్తుందో లేదో చూడాలి. ఈ రోజు కూడా గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిస్సైల్స్ ప్రయోగించింది. దీంతో దుబాయ్ ఎయిర్పోర్టు నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇంకోవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు దాడి చేస్తూనే ఉన్నాయి. టెహ్రాన్లోని ప్రధాన కేంద్రాలపై అమెరికా మిస్సైల్ దాడులు చేస్తోంది. దీంతో అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్లో 1,332 మందికిపైగా మరణించినట్లు అంచనా.