Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంలో (Odisha Train Accident ) ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ప్రభుత్వం ప్రకటించిన పరిహారం (Relief Money) కోసం ఓ మహిళ ఆడిన డ్రామా ఇప్పుడు ఆమెను చిక్కుల్లోకి నెట్టింది. రూ.10లక్షల పరిహారం కోసం రైలు ప్రమాదంలో తన భర్త చనిపోయాడంటూ ఒడిశా కటక్ (Cuttack) సమీపంలోని మనియబంధ (Maniabanda) గ్రామానికి చెందిన గీతాంజలి దత్తా (Gitanjali Datta ) అనే మహిళ పోలీసులను, అధికారులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత ఆమె అబద్ధం చెప్పిందని తేలింది. దీంతో పోలీసులు ఆమెను హెచ్చరించి విడిచిపెట్టారు.
అయితే, గీతాంజలి దత్తాపై ఆమె భర్త బిజయ్ దత్తా (Bijay Datta ) తాజాగా మనియబంధ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజా ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించినందుకు, నకిలీ పత్రాలను సృష్టించి బతికున్న తనను చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేసినందుకు గీతాంజలిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజయ్ తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మనియబంధ పోలీసు స్టేషన్ ఇన్ఛార్జ్ బసంత్ కుమార్ మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా దంపతులు విడివిడిగా ఉంటున్నారని.. భర్త ఫిర్యాదుతో అరెస్ట్కు భయపడిన సదరు మహిళ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెప్పారు. కాగా, ఈ ఘటన బాలాసోర్ జిల్లాలోని బహనాగా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినందున అక్కడే ఫిర్యాదు చేయాలని బిజయ్ దత్తాకు సూచించినట్లు బసంత్ కుమార్ వివరించారు.
ఒడిశా కటక్ సమీపంలోని మనియబంధ గ్రామానికి చెందిన గీతాంజలి దత్తా (35) తన భర్త బిజయ్ దత్తా (40) కనిపించడం లేదని బహనగకు వచ్చింది. ప్రమాదం జరిగిన రోజు తన భర్త కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించాడని, అప్పట్నుంచి తన ఆచూకీ తెలియట్లేదని పోలీసులకు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రమాద బాధితులను తరలించిన ఆస్పత్రులకు కూడా వెళ్లానని అయినా లాభం లేకుండా పోయిందని ఏడ్చేసింది. దీంతో పోలీసులు ఆమెను ఒడిశా ప్రమాద మృతదేహాలు ఉంచిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడున్న ఫొటోలను చూసుకోవాలని సూచించారు. కొన్ని ఫొటోలు చూసిన తర్వాత ఓ వ్యక్తి ఫొటో చూపిస్తూ అతనే తన భర్త అని చెప్పింది.
డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు గీతాంజలి ఆధార్ కార్డ్ను అందజేసింది. అయితే అందులో గీతాంజలి వయస్సు 60 ఏండ్లుగా ఉంది. కానీ ఆమె అంత వయస్సు ఉన్నట్లుగా కనిపించలేదు. పైగా ఆమె ప్రవర్తన కూడా పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో ఆధార్ కార్డ్ ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్లో విచారించారు. అప్పుడు గీతాంజలి భర్త బిజయ్ బతికే ఉన్నాడని తెలిసింది. అంతేకాదు అతను కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించలేదని వెల్లడైంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మృతుల కుటుంబాలకు ఇచ్చే రూ.10 లక్షల పరిహారం కోసమే ఇలా నకిలీ పత్రాలతో వచ్చానని ఒప్పుకుంది. ఈ విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Also Read..
Prabhas | ఆదిపురుష్లో నా పాత్రపై చిరంజీవి అలా అన్నారు : ప్రభాస్
NTR 31 | హాలీవుడ్ రేంజ్లో ప్రశాంత్ నీల్ ప్లానింగ్.. ఎన్టీఆర్ 31లో గ్లోబల్ స్టార్..?
Reddit | రెడ్డిట్లో లేఆఫ్స్.. 5 శాతం ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైన సంస్థ