కోల్కతా : కాషాయ పార్టీపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ (Mamata Banerjee) విమర్శలతో విరుచుకుపడ్డారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు మించవని తేల్చిచెప్పారు. టీఎంసీకి జాతీయ పార్టీ హోదా కోసం తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని దీదీ సవాల్ విసిరారు.
ఈసీ బీజేపీ గుప్పిట్లో ఉందని, వారు తమ పార్టీకి జాతీయ హోదాను తీసేశారని ఆమె దుయ్యబట్టారు. కొద్దిపాటి సామర్ధ్యం ఉన్న పార్టీలకూ జాతీయ పార్టీ హోదా ఇవ్వాలని, తమ పార్ట పేరు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్గా ఉంటుందని దీదీ పేర్కొన్నారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాషాయ పార్టీ నేతలు తాము కోరుకున్నవన్నీ చేస్తున్నారని, అయితే అధికారం తాత్కాలికమేననే విషయం వారు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అధికారం వస్తుంటుంది…పోతుంటుంది కానీ ప్రజాస్వామ్యం ఎన్నటికీ కొనసాగుతుందని దీదీ స్పష్టం చేశారు. రాజ్యాంగం కూడా ఎప్పటికీ నిలిచిఉంటుందని, రాజ్యాంగాన్ని ఎవరూ బుల్డోజ్ చేయలేరని, అందుకే 2024 ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని దీదీ తేల్చిచెప్పారు.
Read More