యాచారం, జూన్ 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతువేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. బుధవారం ఆమె మండలంలోని చౌదర్పల్లి, తక్కళ్లపల్లి గ్రామాల్లో పర్యటించారు. చౌదర్పల్లిలో రైతువేదిక భవనాన్ని పరిశీలించారు. భవనంలోని వసతులు, అందులో నిల్వ ఉంచిన ఎరువులు, విత్తనాలను పరిశీలించారు. రైతువేదిక ప్రయోజనాలపై రైతులతో, అధికారులతో ఆమె మాట్లాడారు. అనంతరం తక్కళ్లపల్లిలోని పురుగుల మందు యూనిట్ను ఆమె పరిశీలించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ..ఇకపై వ్యవసాయ కార్యక్రమాలన్ని రైతువేదిక భవనాల్లో నిర్వహించాలన్నారు. క్లస్టర్ గ్రామాల రైతులు రైతువేదికలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతువేదికల్లో రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఫెర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు. ఎరువులు, మందులు విక్రయిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయాధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సత్యనారాయణ, మండల వ్యవసాయాధికారి సందీప్కుమార్, రైతులు పాల్గొన్నారు.
రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలి
మంచాల జూన్ 16 : రైతు వేదిక భవనాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. బుధవారం బోడకొండ, మంచాల ఆరుట్ల గ్రామాల క్లస్టర్ పరిధిలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం రైతువేదికల్లో అధికారులు ఉన్నారో లేరోనని ఎంపీడీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. వానలు పడుతున్నందున రైతులు పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు, సూచనలు అందజేయాలని చెప్పారు. ఎంపీడీవో వెంట ఈవోపీఆర్డీ మధుసూదనాచారి, కార్యదర్శులు ఉన్నారు.