Summer | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయని నానుడి. ప్రస్తుత ఎండలను చూస్తే ఆ దుస్థితి ముందే వచ్చినట్టు కనిపిస్తున్నది. గత ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతల నమోదు మొదలైంది. మార్చిలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే రికార్డయ్యాయి. దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఈ ఏడాది మార్చి-మే నెలల మధ్య ఎండ చండప్రచండంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేసే ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ ముందే అంచనావేసింది. ఎల్నినో కారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరగడాన్ని ఎల్నినో అంటారు. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్కు చేరితే ఆ పరిస్థితిని ‘సూపర్ ఎల్నినో’ అంటారు. ఉష్ణోగ్రతలకు మించి వేడి తీవ్రత ఉండటాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు ‘ఫీల్ లైక్ టెంపరేచర్’ అంటారు. గాలిలో తేమ శాతం తగ్గడమే దీనికి కారణమని, తద్వారా ఉక్కపోత ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వడదెబ్బ మృతుల సంఖ్య ఈ సారి పెరిగే ప్రమాదం ఉన్నట్టు హెచ్చరించారు. 2024 జూన్ నాటికి ఎల్నినో ప్రభావం క్షీణించి, పరిస్థితి సాధారణస్థితికి వస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. మే చివరి నాటికి లానినో ఏర్పడుతుందని, ఫలితంగా వర్షాకాలంలో మునుపటి కంటే వానలు బాగా పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.