న్యూఢిల్లీ : బ్రిటన్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ వేదికగా భారత ప్రజాస్వామ్యానికి పెను ముప్పు ఏర్పడిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ విమర్శలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే దీటుగా బదులిచ్చారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఖర్గే స్పష్టం చేశారు.
భారత్ పట్ల రాహుల్ ఆగ్రహానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శల నేపధ్యంలో ఖర్గే ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోదీ ఐదారు దేశాలను సందర్శించి మన దేశ ప్రజలను అవమానించినప్పుడు, భారత్లో పుట్టడం పాపమని వ్యాఖ్యానించినప్పుడు వీరంతా ఎక్కడున్నారని రాహుల్ క్షమాపణను డిమాండ్ చేసేవారిని ఖర్గే ప్రశ్నించారు.
భారత్లో ప్రజాస్వామ్యం బలహీనపడుతున్నదని, భావప్రకటన స్వేచ్ఛ కుంటుపడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. టీవీ చానెళ్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు..వాస్తవాలపై గొంతెత్తిన వారిని జైళ్లలో పెడుతున్నారు..ఇది ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడటం కాక మరేంటని ఖర్గే నిలదీశారు. కాగా బ్రిటన్ పర్యటన సందర్భంగా భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్ధకు విఘాతం కలుగుతోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో పాలక పక్షం భగ్గుమంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై కాషాయ పార్టీ ఎంపీలు విమర్శలు గుప్పించారు.
Read More :