న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల నుంచి పలువురు విపక్ష ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. విపక్ష ఎంపీలను మూకుమ్మడిగా సభ నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మంగళవారం కాషాయ పాలకులపై విరుచుకుపడ్డారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ విపక్ష ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ విపక్ష పార్టీల సభ్యులు పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ల నేతృత్వంలో విపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు. ఇంత జరిగినా హోం మంత్రి, ప్రధాని మౌనంగా ఎందుకున్నారు అని రాసి ఉన్న ప్లకార్డులను విపక్ష ఎంపీలు ప్రదర్శించారు.
విపక్ష ఎంపీల సస్పెన్షన్ సరైంది కాదని, ఇది ప్రజాస్వామ్యానికి చేటే కాకుండా పార్లమెంట్కు మాయని మచ్చగా మల్లికార్జున్ ఖర్గే అభివర్ణించారు. తమను చూసి భయపడే పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారని ఖర్గే ఆరోపించారు. లోక్సభ భద్రతా వైఫల్యంపై తమ ఎంపీలు పార్లమెంట్ ముందుంచేందుకు ప్రయత్నించారని, పార్లమెంట్ సమావేశాల్లో భద్రతా వైఫల్యం గురించి విపక్షాలు ఆందోళన చెందుతుంటే ప్రధాని, హోంమంత్రి వారణాసి, అహ్మదాబాద్లో ఉపన్యాసాలు ఇస్తున్నారని ఖర్గే ఎద్దేవా చేశారు.
Read More :